లక్కీ డ్రాప్.. లిక్కర్ కిక్
చివరి రోజు మద్యం షాపుల కోసం ఔత్సాహికులు బారులు తీరారు. మద్యం షాపుల టెండర్ల కోసం శనివారం చివరి రోజు కావడంతో వ్యాపారులు టెండర్లు వేసేందుకు రాత్రి పొద్దుపోయేంత వరకు క్యూలో నిలబడ్డారు. ఆదిలాబాద్లో 40 షాపులకు గాను 683 దరఖాస్తులు, నిర్మల్లో 47 షాపులకు 943 రాగా, మంచిర్యాలలో 73 షాపులకు 1277 దరఖాస్తులు, ఆసిఫాబాద్లో 32 షాపులకు 554 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ వరకు 1839, చివరి రోజు ఏకంగా 1618 దరఖాస్తు వచ్చాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు సంబంధించి దరఖాస్తు ఫారాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
సమయం ముగిసినప్పటికీ డీడీలు తీసుకుని కార్యాలయ ఆవరణలో ఉన్న వారికి అవకాశం కల్పిస్తున్నారు. రాత్రి తొమ్మిది గంటలైనా దరఖాస్తుల స్వీకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫారాలు అప్పగించే వరకు క్యూలో వేచి ఉన్నారు. అయితే, గతంలో టెండర్ల ప్రక్రియ సందర్భంగా వచ్చిన దరఖాస్తుల కంటే ఈసారి తక్కువగా వచ్చాయి. గత ఏడాది 5700 వరకు కాగా, ఈసారి 3,457 వరకు వచ్చాయి. ప్రక్రియ పూర్తయ్యే వరకు 4 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు షాపులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. సరిహద్దుల్లో ఉన్న కోటపల్లి, వేమనపల్లి, దహెగాం, గూడెం తదితర ప్రాంతాల్లో ఉన్న షాపులకు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మన సరుకుకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో సరిహద్దు షాపులకు అధికంగా దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.