40 కేసుల్లో నిందితుడు
Constable murder:ఖరీదైన బైకులు… ఎనిమిది గొలుసు దొంగతనాలు… మరో రెండు దాడి కేసులు… మూడుసార్లు జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు… ఇదీ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ నేర చరిత్ర.. పోలీస్ రికార్డుల్లో రియాజ్ నేర చరిత్ర పరిశీలించిన పోలీసులు సైతం దెబ్బకు నోరెళ్లబెట్టారు. నిజామాబాద్ జిల్లాలో కేవలం మూడేండ్లలో దాదాపు 40 కేసులు నమోదయ్యాయంటే అతని నేర చరిత్రను అర్దం చేసుకోవచ్చు.
బైక్లు ప్రత్యేకించి బుల్లెట్ వాహనాలను దొంగిలించడంలో రియాజ్ సిద్ధహస్తుడు. 30 బుల్లెట్ల అపహరణకు సంబంధించి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులు నమోదయ్యాయి. దొంగిలించాక వాటి చాసిస్, ఇంజిన్ నంబర్లు మార్పి, మహారాష్ట్రలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఎనిమిది గొలుసు దొంగతనాలు, మరో రెండు దాడి కేసుల్లోనూ అతడు. నిందితుడు. ఈ క్రమంలో మూడుసార్లు జైలుకు వెళ్లి బెయిల్పై తిరిగొచ్చాడు.
తాజాగా తనను పట్టుకునేందుకు వచ్చిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేసి ఆయనను హత్య చేశాడు. ఎస్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ రిపోర్టు) డ్యూటీ నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన ప్రమోద్ విధులు ముగించుకుని శుక్రవారం సాయంత్రమే నిజామాబాద్ వచ్చి సీసీఎస్ ఠాణాలో రిపోర్టు చేశారు. కొద్దిసేపటికే నేరస్థుడిని పట్టుకునేందుకు వెళ్లి… అతది చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. రియాజ్ కానిస్టేబుల్ తో పాటు అతని మేనల్లుడు విఠల్ పైనా దాడి చేశాడు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన రియాజ్ యుక్త వయసు నుంచే నేరాల బాటపట్టినట్టు గుర్తించారు.