ఎన్నో ప్రాణాలు పోయేవి
DGP Shivdhar Reddy on Riyaz encounter: కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ పై కాల్పులు జరపకుండా ఉంటే అక్కడ ఎంతో మంది అమాకులు బలయ్యేవారని తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి(DGP Shivdhar Reddy) స్పష్టం చేశారు. ఆయన రియాజ్ ఎన్కౌంటర్పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కానిస్టేబుల్ను హత్య చేసి మరికొందరిని గాయపరిచిన వ్యక్తి చేతికి గన్ వచ్చి ఉంటే ఆసుపత్రిలో బీభత్స జరిగేది అన్నారు. అందుకే అన్నింటి గురించి ఆలోచించిన తర్వాత పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించాడని, ఆత్మరక్షణ కోసం పోలీసులు రియాజ్పై కాల్పులు జరపగా, పోలీసుల కాల్పుల్లో నిందితుడు రియాజ్(Riyaz) మృతి చెందాడని ఆయన వెల్లడించారు.
ఉదయం ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నం చేశాడని, పారిపోయే క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు యత్నించాడని అన్నారు. ఆత్మరక్షణ కోసం రియాజ్పై కాల్పులు జరిపాడని, దీంతో అతను మరణించాడని తెలిపారు. రియాజ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ను హత్య జరిగిన తర్వాత ఈ కేసు ఎంత సంచలనంగా మారిందో ఇప్పుడు హంతకుడి ఎన్కౌంటర్ సంచలనంగా మారింది. అందుకే దీనిపై డీజీపీ కీలక ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలుక కాపాడేందుకే ఎన్కౌంటర్ చేసినట్టు తెలిపారు. ఇప్పటికే కానిస్టేబుల్ను హత్య చేసి, మరికొందర్ని తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి చేతిలో గన్ పడితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పోలీసులు గన్ ఫైర్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రియాజ్ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బైక్ చోరీలు, ఇతర నేరాల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ కోసం చాలా కాలంగా పోలీసులు వెతుకుతున్నారు. శుక్రవారం పోలీసులకు సమాచారం వచ్చింది. కానిస్టేబుల్ ప్రమోద్(Constable Pramod) తన మేనల్లుడిని బైక్పై ఎక్కించుకొని రియాజ్ ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. ఇంతలో స్టేషన్కు సమాచారం ఇచ్చాడు. వాళ్లు కూడా వచ్చారు. ప్రమోద్ నిందితున్ని పట్టుకొని బైక్పై కూర్చొబెట్టుకొని స్టేషన్కు తీసుకెళ్లాడు. సైలెంట్గా కూర్చొని ఉన్న రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్ పై దాడి చేశాడు. రియాజ్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన ప్రమోద్ మేనల్లుడు కూడా ప్రయత్నించాడు. వెనకాలే వస్తున్న ఎస్సై కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వారిద్దర్ని గాయపరిచి పారిపోయాడు రియాజ్.
కేసు సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసి రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల తర్వాత ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. వెంటనే వెళ్లి పట్టుకునేందుకు యత్నించారు. అక్కడ కూడా పోలీసులపై ఎదురు తిరిగేందుకు రియాజ్ ప్రయత్నించాడు. అతన్ని పట్టుకునే క్రమంలో ఓ యువకుడు కూడా గాయపడ్డాడు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గాయపడిన రియాజ్ను, అతన్ని పట్టుకునే ప్రయత్నంలో గాయపడిన మరో యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.