ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలి
Indiramma houses:ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే(Collector Venkatesh Dhotre) అన్నారు. మంగళవారం కాగజ్ నగర్లోని సర్ సిల్క్ కాలనీ వార్డు నెంబర్ 1 లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు కేటాయించి గూడు కల్పిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పథకంలో లబ్ధి పొందిన వారు ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసుకోవాలన్నారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను అందిస్తుందని, ఇండ్లకు బిల్లులు విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తామన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రతిరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై క్షేత్రస్థాయిలో సందర్శించి లబ్ధిదారులకు అవసరమైన సూచనలు అందించాలన్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రుణ మంజూరు చెక్కును అందజేశారు. ఆయనతో పాటు సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాం, గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్ ఉన్నారు.