నిప్పులు చిమ్ముతూ నింగికి…
CMS-03 launch successful:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో(ISRO) మరో ఘనత సాధించింది. బాహుబలి రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి LVM 03-M5 రాకెట్ ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా తొలిసారిగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. సాయంత్రం 5.26 గంటలకు షార్ నుంచి బాహుబలి రాకెట్ LVM3-M5 ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. 4,410 కిలోల బరువున్న సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTOలోకి ప్రవేశపెట్టారు. ఇవాళ సాయంత్రం 5.26 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది బాహుబలి రాకెట్. ఈ ప్రయోగం విజయవంతంతో ఇస్రో మరో మైలు రాయిని చేరుకుంది.. CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది.
CMS-03 ఎందుకంత ప్రత్యేకమంటే….?
ప్రయోగించిన రాకెట్టూ…. అందులోని శాటిలైట్ కూడా ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి… 4,400 కేజీలు బరువు కలిగిన CMS-03 భూమి నుంచి 36 వేల కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇంత బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం ఇదే మొదటిసారి. అందుకే దీన్ని బాహుబలి శాటిలైట్ అంటున్నారు. ఇది పూర్తిగా కమ్యూనికేషన్ రిలేటెడ్ శాటిలైట్. పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందిస్తుంది. ఈ శాటిలైట్ ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. గతంలో జీశాట్-7 అనే ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో ప్రయోగించింది. దీని కాలపరిమితి ముగియడంతో సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో GSAT-7R శాటిలైట్ను రూపొందించి, నింగికి పంపారు. భారత భూ భాగంలోని మారుమూల అటవీ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడంలో ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది.
ఆత్మనిర్భర్ భారత్కు అద్భుత ఉదాహరణ..
ప్రయోగం విజయవంతం అవడంపై ఇస్రో చైర్మన్ నారాయణన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ ఉపగ్రహం సరికొత్త సాంకేతిక టెక్నాలజీతో రూపొందించామన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు అద్భుతమైన ఉదాహరణ ఈ ప్రయోగం అన్నారు. కీలకమైన, సంక్లిష్టమైన ఉపగ్రహాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు, సిబ్బంది బృందానికి అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. ప్రయోగ సమయం కఠినమైన, సవాల్తో కూడుకున్నదని.. వాతావరణం అంతగా సహకరించలేదన్నారు. విజయంలో కీలకపాత్ర పోషించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. శాస్త్రవేత్తలు, సిబ్బంది కృషితోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంలో దిగడంతో ఎల్వీఎం3 భారత్కు కీర్తిని తెచ్చిపెట్టిందని.. నేడు అత్యంత బరువైన ఉపగ్రహాన్ని విజయవంతంగా మళ్లీ విజయాన్ని సాధించిందన్నారు.