డబుల్ బెడ్రూం కావాలంటే మూడు లక్షలు ఇవ్వాలి
-మహిళా కాంగ్రెస్ నేతతో మరో నేత ఫోన్కాల్
-ఆ డబ్బుల్లో పీఏలకు సైతం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం
-ఫోన్లలో వద్దు... నేరుగా మాట్లాడి తీసుకోండి
-ఏఐసీసీ లింక్ దొరికింది.. నేను ఎలా చెబితే అలా
-డీసీసీ రేసులో ప్రభాకరన్న పేరు మాత్రమే పరిశీలన..
-సంచలనం సృష్టిస్తున్న కాంగ్రెస్ నేత ఆడియో కాల్
Congress leader’s audio call leaked:డబుల్ బెడ్ రూం ఇండ్లు కావాలంటే రూ. 3 లక్షలు ఇవ్వమని చెప్పు… ఒక్కో వార్డుకు ఇద్దరి చొప్పున ఎంపిక చేస్తున్నాం.. అదే విధంగా మీ వార్డులో కూడా ఇద్దరిని చూడు… మూడు లక్షలు ఇస్తేనే డబుల్ బెడ్ రూం వస్తుంది… ఆ డబ్బుల్లో కూడా మనమేం తీసుకోం… పీఏలకు ఇవ్వాల్సి ఉంటుంది… ఇదీ బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకుడు ఒకరు మరో మహిళా నేతతో మాట్లాడిన ముచ్చట్లు… వారిద్దరూ మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది…
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల శివారులో బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు. అయితే, అవి పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని పూర్తి చేశారు. ఈ రెండు పడకల ఇండ్లు…. లబ్ధిదారులకు ఇచ్చేందుకు సన్నద్దమయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని బెల్లంపల్లి తహసీల్దార్ ప్రకటించారు. దీంతో దీనికి సంబంధించి పైరవీలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరికి వాటిని ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక్కో ఇంటికి మూడు లక్షలు..
బెల్లంపల్లి పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత మరో మహిళా కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎవరైనా పేద వారు ఉంటే రూ. మూడు లక్షలు ఇస్తే వారికి ఇల్లు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. అయితే, పేద వారైతే మూడు లక్షలు ఎందుకిస్తారంటూ ఆ మహిళా నేత చెప్పడంతో.. అలా కాదు.. జాతీయ రహదారి పక్కన అలాంటి ఇల్లు కట్టుకోవాలంటే ఎంత అవుతుంది తెలుసా..? అంటూ ప్రశ్నించారు. దాదాపు ముప్పై లక్షలు అయితే తప్ప ఇల్లు కాదంటూ చెప్పారు. మూడు లక్షలు ఇస్తేనే ఇల్లు వస్తుందంటూ ఆఫర్ ఇచ్చారు. నీ వల్ల కాకపోతే చెప్పు వేరే వారికి అప్పజెప్తా అంటూ తేల్చశారు.
నేను ఒక్కడినే కాదు.. పీఏలకు కూడా…
ఆ డబ్బులు తనకే కాదని అందులో చాలా మంది ఉంటారంటూ చెప్పుకొచ్చాడు సదరు కాంగ్రెస్ నేత.. పీఏలు సైతం తీసుకుంటారని కుండ బద్దలు కొట్టారు. మన అనుకున్న వాళ్లతో దరఖాస్తు చేయించమని చెప్పిన ఆ నేత వారితో డైరెక్ట్ గా మాట్లాడవద్దని జాగ్రత్తలు చెప్పారు. మళ్లీ ఫోన్లు రికార్డులు చేస్తారని సైతం ఆయన హితబోధ చేశాడు.
ఏఐసీసీ లింక్ దొరికింది..
తనకు ఏఐసీసీ లింక్ దొరికిందని… డీసీసీ అధ్యక్ష పదవి గురించి సైతం ఆ నేత మాట్లాడారు. బెల్లంపల్లి నుంచి డీసీసీ అధ్యక్షుడి పేరు ఒక్కటే పంపించామన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి గురించి బెల్లంపల్లి నుంచి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, డబ్బులు ఎవరైనా పెట్టుకుంటారని ప్రశ్నించానని ప్రభాకర్ అన్న ఒకే అన్నారు. దీంతో బెల్లంపల్లి నుంచి ఒకే ఒక్క పేరు మాత్రమే పరిశీలనకు వెల్లిందని అది ప్రభాకర్ ది మాత్రమేనని తేల్చి చెప్పారు.
ఈ ఆడియో టేపులు జిల్లాలోని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.