మణుగూరు బ్లాక్ సింగరేణికే కేటాయించాలి
Singareni:మణుగూరు PKOC డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికే కేటాయించాలని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సంస్థలోని ముఖ్యమైన కార్మిక సంఘాలు సోమవారం సింగరేణి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మణుగూర్ బ్లాక్ సింగరేణికే కేటాయించాలన్నారు. ఆ బ్లాక్ జెన్ కో, ఇతర ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి సంస్థ స్థిరత్వం, కార్మికుల భవిష్యత్తు కాపాడేందుకు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని ఈ సమావేశంలో స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా PKOC డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించాల్సిన అవసరం, దాని ద్వారా ప్రాంతీయ ఉపాధి, సంస్థ భవిష్యత్ స్థిరత్వం, కార్మికుల భద్రతకు కలిగే లాభాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ఈ బ్లాక్ జెన్కోకు వెళ్లకుండా నిరోధించేందుకు చేపట్టాల్సిన సంయుక్త కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోయగూడెం–3 మరియు సత్తుపల్లి–3 బ్లాకులు కూడా సింగరేణి సంస్థకే దక్కేలా ఎలా కార్యాచరణ చేపట్టాలనే అంశంపై చర్చించి, అనంతరం సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లుని కలసి, ఈ అంశంపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో తెలంగాణ కనీస వేతన సలహా మండలి ఛైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, AITUC ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, CITU , TNTUC నాయకులు పాల్గొన్నారు.