సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం
-మెడికల్ బోర్డు నిర్వహించకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు
-మీ ఎమ్మెల్యేలు, మంత్రులను గల్లాలు పట్టుకుని నిలదీయండి
-కత్తి వాళ్లకు ఇచ్చి మమ్మల్ని యుద్దం చేయమంటున్నారు
-అయినా ముందుండి పోరాటం చేస్తాం
-మంచిర్యాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, కార్మికులు వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, లేనిపక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని, “బొగ్గు గనుల్లో అగ్గి మండిస్తాం” అని హెచ్చరించారు. సింగరేణిలో అంతా అవినీతిమయంగా మారిందన్నారు, ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్రెడ్డి చెబితేనే అక్కడ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సిట్ (SIT) లేదా ఏసీబీ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు.
గతంలో ఇచ్చిన ఉద్యోగాలపై ఏసీబీ విచారణ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారని ఇక్కడ విచారణ చేయాల్సింది సింగరేణి అవినీతి మీదన్నారు. ఏసీబీ విచారణకు భయపడేది లేదన్నారు. “గాడిదలకు గడ్డేసి.. ఆవుకు పాలు పిండితే వస్తాయా?”: సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం తమ్ముళ్లు తమను అడుగుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల గల్లా పట్టుకుని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోరాటంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్ రావు, టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ చిలుముల రాకేష్, జాన్సన్ నాయక్, బోడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.