MLA అందుబాటులో లేక… పరిష్కారం కానరాక…
Bellampalli:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కూరగాయల మార్కెట్ సమస్య రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఆరు రోజులుగా కూరగాయల మార్కెట్ పూర్తిగా బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హోల్సేల్ వ్యాపారస్తులు, కూరగాయల రిటైల్ అమ్మకందారుల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం కాకపోవడంతో మార్కెట్ తెరుచుకోలేదు. హోల్ సేల్ వ్యాపారులు రిటైల్ అమ్మకాలు చేస్తున్నారని.. అది కూడా మార్కెట్ ప్రాంతంలో కాకుండా వేరే చోట చేస్తుండటంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని రిటైల్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సమక్షంలోనే చర్చలు జరిగి సమస్యకు పరిష్కారం దొరికితేనే బంద్ విరమిస్తామని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. హోల్సేల్ వ్యాపారస్తులు వెళ్లి ఎమ్మెల్యే వినోద్ కలిసి బెల్లంపల్లి కూరగాయల వ్యాపారస్తులకు సంబంధించిన విషయాన్ని వివరించారు. ఎమ్మెల్యే బిజీగా ఉన్నారు.. ఆయన రావడానికి ఇంకా రెండు రోజులు సమయం పడుతుందని వ్యాపారులు చెప్తున్నారు. ఎమ్మెల్యే వచ్చే వరకు తమకు కూరగాయలు లేకుంటే ఎలా వంట చేసుకోవాలని బెల్లంపల్లి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయన స్థానికంగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని లేకపోతే ఇలాగే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.