అకాల వర్షం.. అంతులేని శోకం
ఉమ్మడి ఆదిలాబాద్లో ఐదుగురు బలి!
Five people died in joint Adilabad:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఎండలకు విలవిలలాడిన జనం… ఇప్పుడు అకాల వర్షాలకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైతులు ఈ వర్షాలతో అగచాట్లు పడుతున్నారు. తాజాగా బుధవారం తెల్లవారుఝామున కురిసిన వర్షానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అకాల వర్షాలకు మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం తెల్లవారుఝామున భారీ వర్షం పడటంతో పాటు ఈదురుగాలులు వీచాయి. దీంతో మంచిర్యాల జిల్లా లక్షెట్టి పేట మండలంలో రెండు చోట్ల గోడ, షెడ్డు కూలి నలుగురు రైతులు మృత్యువాత పడ్డారు. లక్ష్సెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తమ ధాన్యం ఉంచారు. ఈదురుగాలులు రావడంతో గోడ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన నెల్కి లచ్చన్న తన కొడుకు బస్ ఎక్కించి అక్కడే గోడ వద్దకు వచ్చారు.
అక్కడ ఒక్కసారిగా గోడ కూలడంతో నెల్కి లచ్చన్నతో పాటు రైతులు గుండారపు వెంకటేష్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు మృత్యువాతపడ్డారు. సీదుల హరీశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో తండ్రీకుమారుడు తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు మృతిచెందడంతో బాధిత కుటుంబం కన్నీటిపర్యంతం అవుతోంది. అనంతరం క్షతగాత్రులను లక్షెట్టిపేట, కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
ఇక కొమురం భీం జిల్లాలో సైతం ఈదురుగాలుల ఘటనలో మరొకరు మృత్యువాత పడ్డారు. చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో భాగంగా పిల్లర్ కు ఇనుప పెట్టె అమర్చారు. ఆ ఇనుప పెట్టె కూలడంతో సుగుణ (45) అనే ఇంటి యజమానురాలు మృతి చెందారు.