బీఆర్ఎస్ నేతల ఆందోళన
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గొంతునొక్కడం కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపునకు నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు దుయ్యబట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సీఎం నిండు అసెంబ్లీలో తొక్కుతా.. అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నరుకుతా, పేల్చేస్తా అని మాట్లాడారని పేర్కొన్నారు. కానీ, వారిని విస్మరించి సుమన్పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం శోచనీయమన్నారు. రేవంత్ సర్కార్ నిరంకుశ విధానాలకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేటర్లు అబ్దుల్ సత్తార్, పెట్టం స్వరూప, గుమ్మడి శ్రీనివాస్, అంకం నరేష్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్, బీఆర్ఎస్ నస్పూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, నేతలు వంగ తిరుపతి, పూదరి కుమార్, గోగుల రవీందర్ రెడ్డి, గొర్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.