ఆసిఫాబాద్ పర్యటనకు బయల్దేరిన సీఎం
CM Revanth Reddy: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయల్దేరారు. హైదరాబాద్ MCRHRD నుంచి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వస్తున్నారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి తదితరులు వస్తున్నారు. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు ఒక్క రోజు ముందే ఇక్కడకు చేరుకుని ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి ఆసిఫాబాద్ రానున్నారు. ఆయన జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం రూ.112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుడతారు.
చింతలమానేపల్లి మండలం కౌటాల (రవీంద్రనగర్ క్యాంపు నం-2) గ్రామంలో ఏర్పాటు చేయనున్న 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.56.55 కోట్లు. రెబ్బెన మండలం నాంబాలలో రూ.6 కోట్ల తో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్ పనులకు కూడా ప్రారంభిస్తారు. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సాయంత్రం 5:45 గంటలకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరించనున్నారు.