అభివృద్ధిని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సి పోయి జరిగే పనులను అడ్డుకుంటున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దుయ్యబట్టారు. ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రంగ పేట బ్రిడ్జి పరిశీలించి అనంతరం మాట్లాడారు. మంచిర్యాల,పెద్దపల్లి, అసిఫాబాద్ జిల్లాలకు ఎంతో ఉపయోగపడే బ్రిడ్జిని రద్దు చేయడం బాధాకరమన్నారు. రద్దు చేసిన బ్రిడ్జ్ నిర్మాణ నిధులను లక్ష్మీ టాకీస్ నుంచి పాత మంచిర్యాల, ఆండాలమ్మ కాలనీ వరకు ఆరు వరసల రోడ్డు వెడల్పు కోసం కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. కేవలం తన మీద రాజకీయ కక్షతో ఈ పని చేశారని దుయ్యబట్టారు.
గత ఏడాది మార్చిలో రూ. 13.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రేమ్ సాగర్ రావు శంకుస్థాపన చేశారని, తర్వాత ఆ పనులు మొదలు పెట్టకుండా ఇప్పుడు రాళ్లవాగు నుండి రంగపేట వరకు ఆరు వరసల రోడ్డు నిర్మిస్తున్నారని ఇది ఎంత వరకు సమంజసమన్నారు. ఈ ఆరు వరుసల రోడ్డు ఎవరి లబ్ధి కోసమని దివాకర్ రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు రాళ్లవాగు దగ్గరలో 24 ఎకరాల భూమి కొనుగోలు చేశారని… అక్కడ ఇల్లు కట్టుకుని వెళ్లి రావడానికి అనుకూలంగా ఉండటం కోసమే ఈ ఆరు వరుసల రోడ్డు నిర్మాణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఐబి చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు రోడ్డు వెడల్పు, వివిధ పనుల కోసం రూ. 35 కోట్లు మంజూరు చేయిస్తే… అక్కడ కేవలం నాలుగు వరుసల రోడ్డు మాత్రమే సరిపోతుందన్న నాయకులు ఇప్పుడు అసలు ఏ మాత్రం ట్రాఫిక్ లేని దారికి ఆరు వరసలు రోడ్డు నిర్మాణం ఎందుకో చెప్పాలని..? నిలదీశారు. కేవలం ఇది ఎమ్మెల్యే ఇంటి నిర్మాణం అయిన తర్వాత వెళ్లి రావడానికి అనువుగా ఉంటుందని కేవలం వాళ్ల స్వార్థం కోసం ఈ ఆరు వరుసల రోడ్డు నిర్మాణం అని దివాకర్ రావు దుయ్యబట్టారు. నియోజకవర్గ అభివృద్ధిని పక్కనపెట్టి, కేవలం తన సొంత పనుల కోసం ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని దివాకర్ రావు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. దీనిపై ప్రజలే ఆలోచించాలని ఆయన కోరారు.