పోడు వివాదం.. ఉద్రిక్తం…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో మంగళవారం అటవీ అధికారులు, స్థానికుల మధ్య పోడు భూములపై ఉద్రిక్తత నెలకొంది. అటవీ శాఖ అధికారులు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం కొనసాగింది. స్థానికులు అడ్డుకోవడంతో… ఇరువర్గాల మధ్య వాగ్వాదం , తోపులాట చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు అటవీ శాఖ అధికారుల వాహనాలకు అడ్డుగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తత నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు గ్రామానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు.
కొద్ది రోజులుగా అధికారులు, స్థానికులు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అటవీ సంరక్షణ చర్యల్లో భాగంగా అటవీ అధికారులు సరిహద్దులు ఏర్పాటు చేయడం, ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులు అడ్డుకోవడంతో ఈ లొల్లి తలెత్తుతోంది. అన్యాక్రాంతమవుతున్న అటవీ భూములు కాపాడేందుకు అధికారులు కందకాలు తవ్వడం, హద్దులు నిర్ణయిస్తున్నారు. అయితే రైతుల వాదన మరోలా ఉంది. తాము తాతల కాలం నుంచి ఆ భూములను నమ్ముకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమకు పట్టాలు ఇవ్వాలని పోడుదారులు డిమాండ్ చేస్తున్నారు.