ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం..
గూడెం దేవాలయంతో పాటు, లిఫ్టు ఇరిగేషన్ పనులకు సైతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. పీపుల్స్ మార్చ్ మూడేళ్లయిన సందర్భంగా పిప్పిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి నిధులు ఇస్తామని ప్రకటించారని, ఆయన ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇచ్చారని వెల్లడించారు. రూ. 70 కోట్ల నిధులు గూడెం ఆలయం అభివృద్ధి కి మంజూరయ్యాయన్నారు. ఈ రోజు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం అభివృద్ధి భూమి పూజ చేసుకుటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. నిధులు ఇస్తామని ప్రకటించిన 37 రోజుల్లో భూమి పూజ చేస్తున్నట్లు భట్టి గుర్తు చేశారు.
రూ. 2216 కోట్లతో దేవాలయాల అభివృద్ధి చేశామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరస్వతీ పుష్కరాలు వైభవంగా నిర్వహించామన్నారు. రూ. 802 కోట్లతో గోదావరి పుష్కరాలకు నిధులు మంజూరు చేసామని చెప్పారు. దైవ భక్తి కోసం నిధులు ఇస్తూనే రైతులకు 74 కోట్లతో గూడెం లిఫ్టు ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, మంచిర్యాల ఎమ్మల్యే ప్రేంసాగర్ రావు ఉన్నారు. అనంతరం భట్టి, మంత్రులు గూడెం సత్యనారాయణ స్వామిని సందర్శించుకున్నారు.