కార్మికుల జీతాల్లో కోత.. కవిత పర్యటన ఎఫెక్ట్..
Singareni:మందమర్రి ఏరియా కాసిపేట-1 గనిలో పలువురు కార్మికుల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. రెండు రోజుల క్రితం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేపట్టిన “బాయిబాట” పర్యటన అనంతరం ఈ నిర్ణయం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
కవిత తన పర్యటనలో భాగంగా తొలుత కాసిపేట-1 గనిని సందర్శించి కార్మికులతో సమావేశమయ్యారు. గని ఆవరణలో గేట్ మీటింగ్కు అనుమతి లేదని సింగరేణి భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, కవితతో పాటు హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్, ఇతర నాయకులు గని వద్దకు చేరుకుని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ నెల 15న నిర్వహించిన హెచ్ఎంఎస్ గేట్ మీటింగ్కు ముందస్తు అనుమతి తీసుకోలేదని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. అనుమతి లేని సమావేశంలో పాల్గొన్న కార్మికులు పని గంటలను వినియోగించుకున్నందున, ఆ సమయానికి సంబంధించిన వేతనాన్ని కోత విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, కవిత పర్యటన అనంతరం ఈ చర్యలు తీసుకోవడంపై కార్మిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.