భూమి కోసం బంధం బలి..!
-తమ్మున్ని నరికి చంపిన అన్న
-గతంలో పంచాయతీ, జరిమానా విధించిన పెద్దలు
-వివాదం సద్దుమణగకపోవడంతో హత్య
-విచారణ నిర్వహిస్తున్న పోలీసులు
ఓ భూమి వివాదం యువకుడి ప్రాణాన్ని బలిగొంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన సందన వేణి రాజేష్ (28)పై ఆయన అన్న చందు గొడ్డలితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం రేపింది. భూమి తగాదాలతో ఈ హత్య జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం, భూమి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఇదే అంశంపై గతంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. ఈ వ్యవహారంలో వారికి జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అయినా వివాదం సద్దుమణగకపోవడంతో చివరకు హత్యకు దారితీంది.
హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.