స‌ర్వేలో పాల్గొని.. ఫారాలు నింపి..

ఓటు హక్కు పరిరక్షణకు స్వయంగా రంగంలోకి ఎంపీ..!

MP Gaddam Vamsi Krishna:పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఓటు హక్కు పరిరక్షణ లక్ష్యంగా తాండూర్‌లో నిర్వహిస్తున్న SIR సర్వేలో స్వయంగా పాల్గొన్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను సేకరిస్తూ, తన చేతులతోనే SIR ఫారమ్‌లను నింపి ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది. ఒక్క అర్హుడి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడటం మనందరి బాధ్యత” అన్నారు. SIR ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, న్యాయబద్ధంగా నిర్వహించాలని అధికారులను కోరారు.

అనంతరం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ, అక్కడ జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి పోలియో నివారణ చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రజల మధ్యే ఉంటూ వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డీసీసీ అధ్య‌క్షుడు పిన్నింటి ర‌ఘునాథ్ రెడ్డి, ఏఎంసీ డైరెక్ట‌ర్ కామినేని శ్రీ‌నివాస్‌, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఈసా, ఇద్రీస్‌, శంక‌ర్‌గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like