ఏసీబీ వలలో ఇద్దరు సాగునీటి శాఖ ఇంజినీర్లు
ఆదిలాబాద్లో లంచం తీసుకుంటూ సాగునీటి శాఖకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) రమేష్లు కోళ్ల ఫారం (పౌల్ట్రీ ఫారం)కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) జారీ చేసేందుకు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో లంచంలో భాగంగా రూ.60 వేల నగదు స్వీకరిస్తుండగా ఆదిలాబాద్లోని వారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.