ఉత్త‌ర‌, ద‌క్షిణ రైలు మార్గానికి మూడో లైన్ సిద్ధం

South Central Railway: కాజీపేట- బల్హార్షా మధ్య మూడో లైను మార్గం పూర్త‌య్యింది. 203 కిలోమీట‌ర్లు ఉన్న ఈ రైల్వే లైను ప‌నులు బుధ‌వారంతో పూర్త‌య్యాయి. గురువారం ఆసిఫాబాద్ – సిర్‌పూర్ కాగజ్‌నగర్ మధ్య 11 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్ విద్యుదీకరణ పనుల చివరి దశతో పాటు బీబ్రా నదిపై వంతెన నిర్మాణం కూడా పూర్తయిందని, దీంతో ఈ ప్రాజెక్ట్ ముగిసిందని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ(South Central Railway GM Sanjay Kumar Srivastav) వెల్లడించారు. కాజీపేట – బల్హర్షా మార్గం దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ఒక కీలకమైన రైలు మార్గం కావడంతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ప‌నులు పూర్తి చేసింది.

ఈ మార్గంలో రద్దీని తగ్గించడానికి, రాఘవపురం – మందమర్రి మధ్య 33 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్ పనులు 2016లో పూర్తయ్యాయి. ట్రాఫిక్‌ను మరింత సులభతరం చేయడానికి, కాజీపేట – బల్హర్షా మార్గంలోని మిగిలిన 203 కిలోమీటర్ల (తెలంగాణ-159 కి.మీ. మహారాష్ట్ర-44 కి.మీ.) మేర ట్రిప్లింగ్, విద్యుదీకరణ పనులకు 2015-16 సంవత్సరంలో అనుమతి లభించింది. సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే బల్హర్షా స్టేషన్ సమీపంలోని ఒక చిన్న భాగం మినహా, మొత్తం మార్గంలో ట్రిప్లింగ్, విద్యుదీకరణ పూర్తయ్యింది. ఇందులో భాగంగా కొత్తగా వేసిన మూడవ లైన్‌ను బల్హర్షా యార్డ్‌కు అనుసంధానించే పనులు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారిపై రైళ్ల రాక‌పోక‌ల‌ను సులభతరం చేయ‌నుంది. ఈ మార్గంలో థర్మల్ పవర్ ప్లాంట్లు, కర్మాగారాలకు బొగ్గు, సిమెంట్, ముడి పదార్థాల రవాణాపెద్ద ఎత్తున జ‌ర‌గుతుంది. అదే సమయంలో ప్యాసింజర్ రైలు సర్వీసులను పెంచడానికి వీలు కల్పిస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like