ప్రాణాలు నిలబెట్టిన వైద్య దేవత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అత్యవసర పరిస్థితిని గుర్తించిన ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మమత రెడ్డి సమయస్ఫూర్తితో స్పందించి చికిత్స ప్రారంభించారు.
పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో డాక్టర్ మమత పలుమార్లు సీపీఆర్ నిర్వహిస్తూ నిరంతరం వైద్య సేవలు అందించారు. ఆమె నిరంతర ప్రయత్నాల ఫలితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె మళ్లీ స్పందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
డాక్టర్ మమత చూపిన అంకితభావం, సమయస్ఫూర్తిని మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశంసించారు. క్లిష్ట సమయంలో ఆమె అందించిన వైద్య సేవలు అభినందనీయమని కొనియాడారు.
ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు సమాచారం. డాక్టర్ మమత సేవలను బీఆర్ఎస్ శ్రేణులు, వైద్య సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.