గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించండి
డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్), సీఎండీని కలిసిన టీబీజీకేస్ అధ్యక్షుడు మిర్యాల
సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు రెండేళ్ల కాలపరిమితి పూర్తయినందున వెంటనే కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు జరిగే వరకు అన్ని యూనియన్లకు సమాన ప్రాతిపదికన హోదా కల్పించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 27, 2023న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయాన్నారు. అదే రోజున డిప్యూటీ సీఎల్సీ ఎన్నికల ఫలితాలు, గుర్తింపు యూనియన్ హోదా ప్రకటించారని వెల్లడించారు. అయితే, ఫలితాలు 27.12.2023న ప్రకటించినా, యూనియన్ల అంతర్గత అంశాల కారణంగా ఎన్నికైన యూనియన్లకు గుర్తింపు/ప్రాతినిధ్య హోదా పత్రాలు 09.09.2024న అందినట్లు చెప్పారు.
గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి ఇప్పటికే రెండు సంవత్సరాలకు పైగా కాలం పూర్తయిందన్నారు. గుర్తింపు హోదా పత్రం అందుకున్న తేదీ నుంచి చూసినా రెండు సంవత్సరాల కాలపరిమితి 08.09.2026 నేటితో పూర్తయిందని మిర్యాల స్పష్టం చేశారు. తాము ఎన్నికలకు సంబంధించి TBGKS తరఫున హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. సంస్థలో ప్రజాస్వామ్యయుత పారదర్శకమైన ప్రాతినిధ్య వ్యవస్థను కొనసాగించేందుకు కార్మిక సంఘ ఎన్నికలు నిర్వహించాలన్నారు.
ఈ మేరకు సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని రాజిరెడ్డి కోరారు. అలాగే, కొత్త ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించే వరకు, సింగరేణిలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా (Equal Status) పొడిగించాలన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.