వరంగల్లో రోడ్డు ప్రమాదాలు… ఐదుగురి మృతి
వరంగల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఖిల్లావరంగల్ మండలం బొల్లికుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. ప్రమాదతీవ్రతకు ఆటో ఏకంగా రెండు ముక్కలైంది. మృతి చెందిన వారిలో అల్లీపురానికి చెందిన ఆటో డ్రైవర్ సింగారపు బబ్లూ ఉన్నట్లుగా గుర్తించారు. మరో ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఖమ్మం బైపాస్ హంటర్ రోడ్డు ఫ్లైఓవర్పై ఓ కారు మరో కారును ఢీ కొట్టింది. దీంతో కారు అదుపు తప్పి కల్వర్ట్ దాటి కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతి చెందిన వారిని ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన దంపతులని.. ప్రభుత్వ ఉద్యోగి సారయ్య (42), ఆయన భార్య సుజాత(39)గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో కారులో ఉన్న నలుగురు క్షేమంగా బయటపడ్డారు.