‘మంచి‘నీరు.. ఇవ్వండి సారూ..
మంచిర్యాల : వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ… వందల కోట్ల లాభాలు… కార్మికుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తున్నామని ప్రతి సారి సింగరేణి బాకాలు ఊదుకుంటుంది. కానీ, వాస్తవానికి కార్మికులకు కనీసం మంచినీటిని సైతం సరఫరా చేయలేని దుస్థితి. ప్రతిసారి ఇదే దుస్థితి. ఎన్నిమార్లు అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. దీంతో కార్మాకులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బెల్లంపల్లి పట్టణంలో చాలా రోజులుగా సింగరేణి యాజమాన్యం కలుషిత నీటిని సరఫరా చేస్తోంది. ఆ నీరు బురదగా ఉండటం, దుర్వాసన వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మంచినీరు కూడా అగచాట్లు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. స్టేషన్ రోడ్ ఏరియాలో వారం రోజులుగా ఇదే దుస్థితి. మంచినీటి సరఫరా లైన్లో డ్రైనేజీ వాటర్ కలవడంతో సమస్య వస్తోంది. పైపులు పగిలి ఈ రెండు నీళ్లు కలుస్తున్నాయని కార్మికులు చెబుతున్నారు. వంటలు చేసుకునేందుకు మినరల్ వాటర్ వాడుతున్నామని గృహిణులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.