కావాలనే మంత్రి నాపై కేసులు పెట్టిస్తున్నారు
-ప్రజల కోసం పనిచేసే వ్యక్తికి
-ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు
-సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్
మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనపై కావాలనే కేసులు పెట్టిస్తోందని సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ఆరోపించారు. సరూర్నగర్ పోలీసులు తనకు నోటీసులు జారీ చేసిన సందర్భంగా ఆమె పోలీస్స్టేషన్ వద్ద మాట్లాడారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రజల గురించి మంత్రిని ప్రశ్నిస్తున్నందుకే తనపై కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరూర్ నగర్ వీఎం హోంలో ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా అడ్డుకున్నానని తెలిపారు. విద్యార్థుల తరగతులు జరుగుతున్న వేళ షూటింగులకు ఏ విధంగా అనుమతి ఇస్తారని ప్రశ్నించానని అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకు కేసు నమోదు చేయించారని అ న్నారు. వీఎం హోం ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవని తాను ప్రశ్నించారని తెలిపారు.
సరూర్ నగర్ ప్రజాప్రతినిధిగా డ్రైనేజీలు సరిగా లేవని, మరిన్ని అభివృద్ధి పనుల కోసం ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు నిధులు అడిగితే ఇవ్వలేదన్నారు. కానీ, అక్కడ సినిమా షూటింగ్ కోసం ఏకంగా పాఠశాలకు రూ.4 కోట్లు కేటాయించి నాసిరకం పనులు చేయించారని దుయ్యబట్టారు. కనీసం కాంట్రాక్టు వర్క్ కూడా కాకుండా నామినేషన్ వేసి పనులు చేయించారని అన్నారు. తాను ఇవన్నీ ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారని దుయ్యబట్టారు. చాలా మంది తనను ముందుగానే హెచ్చరించారని శ్రీవాణి స్పష్టం చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లో భయపడనని శ్రీవాణి స్పష్టం చేశారు.
నేను ప్రశ్నిస్తూనే ఉంటానని వెల్లడించారు. మంత్రిని గద్దె దించడం ఖాయమని వెల్లడించారు.