పెద్దపల్లి జిల్లాలో అరెస్టుల పర్వం
-ఓదెల దేవాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
-పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి హౌస్ అరెస్టు
A flurry of arrests in Peddapally district: పెద్దపల్లి జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఇసుక కాంట్రాక్టర్ల వద్ద ముడుపుల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత చింతకుంట విజయరమణారావు.. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఓదెల మల్లన్న ఆలయంలో ప్రమాణం చేయాలంటూ డిమాండ్ చేయడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు నేతలు ఆలయం వద్దకు చేరుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత విజయ రమణారావు ఆదివారం మల్లన్న గుడి వద్దకు చేరుకోవడంతో పోలీసులు ఆయన్ని అక్కడ అరెస్ట్ చేయగా.. మల్లికార్జున స్వామి ఆలయానికి బయల్దేరుతున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో అడ్డుకున్న పోలీసులు ఆయన్ను ఇంట్లోనే ఉంచారు. ఓదెల మండలంలో మానేరు తీరంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా విషయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని అక్రమాలకు అండగా ఉంటున్నారని విజయ రమణారావు ఆరోపించారు. తాను అవినీతికి పాల్పడలేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వామి వారి మీద ప్రమాణం చేయాలని విజయ రమణారావు డిమాండ్ చేశారు.
దాదాపు వారం రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఇసుక ముడుపులపై మాటల యుద్ధం జరుగుతుండగా రెండు వర్గాల నాయకులు కార్యకర్తలు ఆదివారం ఓదెల మల్లికార్జున స్వామికి దేవాలయానికి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం మల్లికార్జున స్వామి దేవాలయానికి చేరుకున్న విజయ రమణారావు పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఓదెల ఆలయం ఎదురుగా మల్లికార్జున స్వామి ఫోటో పై ప్రమాణం చేశారు విజయ రమణారావు. పెద్దపల్లి ప్రజలకు ఎవరు సాయం చేస్తారో, ఎవరు దోచుకుంటారో బాగా తెలుసంటూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాశంగా మారింది.