50 గంటల సమయం
-శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-ఆరు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ లైన్
-నాలుగు రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగే అవకాశం
50 hours for darshan of Tirumala Srivaru: ఏడుకొండల వాడి దర్శనానికి 50 గంటలు.. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ 6 కిలోమీటర్లు దాటిపోయింది. గోగర్భం డ్యాం వరకు క్యూలైన్లు ఉన్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అందరికీ అన్నం, నీరు అందించాలంటే అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఇదీ ప్రస్తుతం తిరుమలలో ఉన్న పరిస్థితి.
తమిళులకు ఎంతో పవిత్రమైన పెరటాశి మాసం… అందులోనూ మూడో శనివారం.. దసరా సెలవులు.. ఇలా అన్ని కలిసిరావడంతో దేవదేవున్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. రెండు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగతోంది. ఈ శనివారం మరింత పవిత్రమైన దినం కావడంతో భక్తులు మరింతగా పెరిగారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం ఉదయం వరకు క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. పెద్ద ఎత్తున తమిళ భక్తులు తరలివచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులతో కలిసి శుక్రవారం రాత్రి గోగర్భం వద్ద క్యూలైన్లను పరిశీలించారు.
భక్తులు ఆహారం, తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు సంయమనంతో వేచి ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పోలీసులు, అన్ని విభాగాలు సమన్వయం చేసుకొని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.