అనుకోకుండా జరిగింది… క్షమించండి
![](https://naandinews.com/wp-content/uploads/2023/08/Talasani-Srinivas-Yadavg-750x430.jpg)
Minister Talasani Srinivas Yadav:ఈ మధ్య కాలంలో జరిగిన ఓ ఘటనపై శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా జరిగిన ఘటన అని దానిని పెద్దది చేయవద్దని కోరారు. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… కొద్ది రోజుల కిందట ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది. దీనికి మంత్రి కేటీఆర్తో పాటు తలసాని శ్రీనివాస్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోసేయడం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. దీనిపై తలసాని మాట్లాడుతూ ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్కి మంత్రి కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తన కాలు తొక్కుతూ ముందుకెళ్లాడన్నారు. దీంతో తన కాలికి గాయమై రక్తమొచ్చిందన్నారు. ఆ సందర్భంగానే ఆ వ్యక్తిని నెట్టి వేశానని తలసాని తెలిపారు. సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారన్నారు.
ఇక తను తోసేసిన వ్యక్తి బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలిసిందని తలసాని తెలిపారు. ఆయన గిరిజన బిడ్డా అని తెలిసిందని వెంటనే ఆయనకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పానన్నారు. దీనిపై కావాలనే తనపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. తాను బడుగు, బలహీన, దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకనని తలసాని అన్నారు. తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి మరోసారి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.