అంబేద్క‌ర్ క‌ల‌ల‌ను నిజం చేస్తున్నాం..

-దళిత బంధు కార్యక్రమం కాదు.. అదొక ఉద్యమం
-మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు

భారత రాజ్యంగ నిర్మాణ అంబేద్క‌ర్ క‌న్న క‌ల‌లు నిజం చేస్తున్నామ‌ని మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16% కాంట్రాక్టు ఏజెన్సీలను ఎస్సీలకు రిజర్వ్ చేసే ప్రక్రియ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దళితులు కూలి పనులకు మాత్రమే పరిమితం కావొద్దని అంబేద్క‌ర్ ఆకాక్షించార‌ని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని స్వాతంత్ర్యానికి ముందే బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాశారని చెప్పారు. నాడు అంబేద్కర్ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నార‌ని తెలిపారు. గతంలో నీటిపారుదల శాఖలో జరిగే టెండర్లలో 21% ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తూ జీవో 59 విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. ఇప్పటికే వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. 300కు పైగా షాపుల్లో గల్లాపెట్టెల మీద దళతులు కూర్చున్నారని చెప్పారు.

ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్ & సెక్యూరిటీ, డైట్ ఏజెన్సీల్లో 16% దళితులకు కేటాయిస్తున్నామ‌ని చెప్పారు. వంద పడకల లోపు హాస్పిటల్ ఒక కేటగిరిగా.. వంద పడకలకు పైగా ఉన్న హాస్పిటల్ మరో కేటగిరి గా విభజించామ‌న్నారు. ఏయే ఆస్పత్రులను రిజర్వ్ చేయాలో డ్రా ద్వారా పారదర్శకంగా నిర్ణయించామ‌ని మంత్రి హ‌రీష్ వెల్ల‌డించారు. మొత్తం 56 హాస్పిటల్ లను దళితులకు కేటాయించామన్నారు. వీటికి త్వరలో టెండర్లు పిలుస్తారని స్ప‌ష్టం చేశారు. ఎస్సీ యువత వీటిని అందిపుచ్చుకునేలా టెండర్ల‌ నిబంధనల్లో మార్పులు చేశామ‌న్నారు. ఒక్క టెండర్ వచ్చినా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించామ‌ని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం ఒక్కో బెడ్ కు ఇచ్చే చార్జీలను రూ. 5000 నుంచి రూ.7500 కు పెంచిన‌ట్లు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం అదనంగా ఏటా రూ.325 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నదని వెల్ల‌డించారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు కేవలం కార్యక్రమం మాత్ర‌మే కాద‌ని, అదొక ఉద్యమం అన్నారు. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదన్నారు. దళిత బంధు లబ్దిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా.. ఆ యూనిట్ ను గ్రౌండ్ చేసేలా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో లబ్దిదారునికి మార్గనిర్దేశం చేస్తున్నారని చెప్పారు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. డైట్ ఛార్జీలను సైతం రెట్టింపు చేశామ‌ని, మెడికల్ షాపుల్లో కూడా రిజర్వేషన్ ఎలా అమలు చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాస్ రావు, డీఎం ఈ రమేష్ రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎన్డీ గంగాధర్ తో కలిసి డ్రా ద్వారా హాస్పిటళ్ళను ఎంపిక చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like