మొత్తం కుప్పకూలిన అందెల్లి బ్రిడ్జి

Andelli Bridge which has completely collapsed: కాగజ్‌నగర్‌ దహెగాం ప్రధాన రహదారి అందవెల్లి సమీపంలొ పెద్ద వాగు పై ఉన్న వంతెన పూర్తిగా కుప్పకూలింది. రెండు నెలల కిందట భారీ వర్షాలు, వరదలతో పిల్లరు కుంగి పోయింది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత మరింతగా కుంగిన వంతెన బుధవారం అర్ధరాత్రి కుప్పకూలింది. దానికి సంబంధించిన ‌‌రెండు పిల్లర్లు, మూడు స్లాబులు నేలమట్టం అయ్యాయి.

కొమురం భీం జిల్లాలోని అందవెల్లి పెద్దవాగుపై వంతెన కుప్పకూలింది. గతంలో కుంగిన బ్రిడ్జి పై నుండి అధికారులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో 42 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్ర‌జ‌లు దిక్కుతోచ‌ని స్థితిలో తెప్ప‌ల‌పై ప్ర‌యాణం సాగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట విద్యార్థులతో వెళ్తున్న తెప్ప బోల్తాపడింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికి ఏం కాలేదు. ప్రతిరోజు వివిధ పనులపై కాగజ్‌న‌గ‌ర్‌ పట్టణానికి వచ్చే ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కాగజ్ నగర్ నుండి దహెగాం మండల కేంద్రానికి వెళ్లాలంటే రెండు ఆటోలు మార్చాల్సి వ‌స్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోను ఎంగేజ్ చేసుకుంటే ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. దీంతో వారికి ఆర్థికంగా ఎంతో భారం పడుతోంది. ఇక వైద్య సేవలు లేని మారుమూల గ్రామ ప్రజలు మరో మార్గంలో వెళ్లాలంటే 80 కిలోమీటర్ల‌ దూరం ప్రయాణించవలసి వ‌స్తోంది. ఈ వంతెన పూర్తైతే త‌ప్ప త‌మ క‌ష్టాలు తీర‌వని ప్రజలు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, ఈ వంతెన కుప్పకులడంతో వంతెన ఇప్ప‌ట‌ల్లో పూర్తయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేద‌ని స్థానికులు చెబుతున్నారు.

అస‌లు అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ఈ బ్రిడ్జి వంగిపోయింద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక్క‌డ ఎండాకాలంలో పెద్ద ఎత్తున ఇసుక అక్ర‌మ ర‌వాణా సాగింది. ఇసుక దొంగలు వంతెన పిల్లర్ వద్దే తవ్వకాలు చేసి ఇసుకను అక్రమరవాణా చేశారు. అధికారుల దృష్టికి ఈ విష‌యం వెళ్లినా ప‌ట్టించుకోలేదు. ఈ వ్య‌వ‌హారంలో కొంద‌రు అధికారులు కావాల‌నే చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని ప‌లువురు దుయ్య‌బ‌డుతున్నారు. అలా ఇష్టారీతిన ఇసుక త‌ర‌లింపు నేప‌థ్యంలో పిల్లర్ భూమిలోకి కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like