మోదీ తెలంగాణ మీద విషం క‌క్కుతున్న‌డు

-తెలంగాణకు నిధులు ఇవ్వకుండా బ్యాంకర్లను బెదిరిస్తున్నారు
-సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌కు పూర్తి స్థాయిలో కుట్ర‌
-ఆ నాలుగు బ్లాక్‌లు సింగ‌రేణికే ఇవ్వండి
-మోడీ పర్యటనతో తెలంగాణకు ఒరిగింది, జరిగింది ఏం లేదు
-కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగిన బాల్క సుమ‌న్

balka-suman-fires-on-central-government: దేశ ప్ర‌ధానిగా అత్యున్న‌త ప‌ద‌విలో ఉండి మోదీ తెలంగాణ‌పై విషం క‌క్కుతున్నాడ‌ని ప్ర‌భుత్వ విప్‌, మంచిర్యాల టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మిషన్ కాకతీయ కు రూ. 5000 కోట్లు, మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణకు నిధులు ఇవ్వకుండా బ్యాంకర్లను బెదిరిస్తున్నారని ఇంత నీచం ఇంకోటి ఉంటుందా..? అని ప్ర‌శ్నించారు. మోడీ హయాంలో పెరిగిన గ్యాస్, ఆయిల్, నిత్యవసరాలు, పెట్రోల్ రేట్లతో దేశ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల మందికి జన్‌ధ‌న్‌ ఖాతాలో వేస్తానన్న డబ్బులు ఏమయ్యాయని..? ఆయ‌న ఈ సంద‌ర్భంగా ప్రశ్నించారు.

సింగరేణిని ప్రైవేటీకరించాలని కుట్ర చేసింది నిజం కాదా అని కేంద్రాన్ని నిల‌దీశారు. కేంద్రానికి ఆ ఉద్దేశం లేకపోతే ఇప్పటికే ప్రకటించిన నాలుగు బొగ్గు బ్లాక్ లను సింగరేణికి తిరిగి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. బార్డర్లో సైనికుల్లా పనిచేసే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపులో తాము ఎనిమిది సంవ‌త్స‌రాల కింద‌టే తెలంగాణ అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపామ‌ని గుర్తు చేశారు. భవిష్యత్తులో సింగరేణి 49% ప్రభుత్వ వాటా అమ్మడానికి కేంద్రం కుట్ర చేస్తోంద‌న్నారు. 16 వ వేజ్ బోర్డుపై ఇంతవరకు ఎందుకు సమీక్షించుకోలేదని.. వెంటనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.

రిటైర్డ్ అయిన కార్మికులకు ఇస్తున్న పెన్షన్లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంద‌ని వెంటనే పెంచాలని బాల్క సుమ‌న్‌ డిమాండ్ చేశారు. నిన్నటి మోడీ పర్యటన పూర్తిగా విఫలమైందన్నారు. ప్రధాని మోడీ పర్యటన వ్యతిరేకిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, నల్ల జెండాలతో నిరసన తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిజెపి ఒక బడా జూట పార్టీ.. జూమ్ల పార్టీగా అభివ‌ర్ణించారు. మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణపై కేంద్రం చేస్తున్న మోసం దగా మరొకసారి నిరూపితమైందన్నారు. తెలంగాణ ప్రజలను మరొకసారి నయవంచన చేశారని ఎద్దేవా చేశారు.

14 నెలల క్రితమే ప్రారంభమై 68 కోట్లు లాభాలు గడించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించడం ఒక కుట్రగా బాల్క సుమ‌న్‌ అభివర్ణించారు. బీజేపీ ఏజెంట్లతో.. వేలకోట్లతో తెలంగాణ ప్రభుత్వ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చేసిన కుట్రను ఛేదించి వారిని తెలంగాణ ప్రజల ముందు ద్రోహిగా నిలబెట్టినందుకే మోడీ హుటాహుటిన రామగుండం పర్యటన పెట్టుకున్నార‌ని అన్నారు. రాష్ట్ర ప్రజలను, మీడియా దృష్టి మరల్చడానికే మోడీ ఆఘ‌మేఘాల మీద రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ ప్రారంభోత్సవ డ్రామాలు చేశారన్నారు.

తల్లిని చంపి బిడ్డని వేరు చేసిందని.. తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని గతంలో బిజెపి తెలంగాణ ప్రజలను అవమానించారని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ హోదా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీలు, నవోదయ విశ్వవిద్యాలయాలు, జీఎస్టీ బకాయిలను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో కొనసాగుతున్న తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేక కన్నెర్రతో కడుపు మంటతో తెలంగాణపై విషం కక్కుతున్నారు. మూడుసార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆహ్వానించకుండా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. తెలంగాణలో పండించిన వడ్లను కొనలేని మీరు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమ‌ని ఎద్దేవా చేశారు.

బీజేపీ ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టినట్టు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పంపిన ఆ పార్టీ ఏజెంట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం చంచలగూడ జైల్లో పెట్టిందన్నారు. శ‌నివారం పర్యటనలో మోదీ తెలంగాణ పై మరొకసారి విషయం కక్కాడని, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. మోడీ పర్యటనతో తెలంగాణకి ఒరిగిందేమీ లేదని..డొల్ల ప్రకటనలు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేన్నారు.

గుజరాత్ లో ఎన్నికలు ఉన్నాయని 1.35 లక్షల నిధులు సమకూర్చిన మోడీ తెలంగాణకు మాత్రం చేసింది ఏం లేదని బాల్క సుమ‌న్ దుయ్య‌బ‌ట్టారు. కర్ణాటకలో కాంట్రాక్టర్లు 40% కమిషన్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇవ్వలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 2014లో మోడీ స్నేహితుడు అదాని ఆస్తులు ఎంత❓️ ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. అదానిని ప్రపంచ కుబేరుడుగా చేయడమే మోడీ లక్ష్యం అని ఎద్దేవా చేశారు.
ప్రకృతి సంపదను ప్రభుత్వ సంస్థలను పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబెట్టే కుట్రలకు కేంద్రం ప్రయత్నిస్తున్న‌ద‌ని అన్నారు.

ఇప్పటికే ఆరున్నర లక్షల కోట్ల సంపద పెట్టుబడిదారులకు మళ్ళిందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.మునుగోడు లో దేశ నాయకులు అందరూ కలిసి వచ్చినా, వేలకోట్లతో ఓటర్లను ప్రభావితం చేయాలని చూసినా టీఆర్ఎస్ గెలుపు ఆపలేకపోయారని అన్నారు. రాజగోపాల్ ని ఎర‌గావేసి కృత్రిమ ఉప ఎన్నికను సృష్టించాలని చూస్తే ప్రజలు అద్భుతమైన తీర్పుతో టిఆర్ఎస్ ని గెలిపించారని స్ప‌ష్టం చేశారు. ఈ స‌మావేశంలో ఆయ‌న‌తో పాటు జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రేణికుంట్ల ప్ర‌వీణ్,మంచిర్యాల మున్సిప‌ల్ చైర్మ‌న్ పెంట రాజ‌య్య‌, వైస్ చైర్మ‌న్ ముఖేష్ గౌడ్, టీబీజీకేఎస్ మంద‌మ‌ర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిప‌ల్లి సంప‌త్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like