సూటుకేసు కంపెనీలు… అర్రాజు పాట‌లు

-ఎన్నిక‌ల్లో విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నారు
-వివేక్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులకు డబ్బులు
-ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి పట్టిన పీడ
-అభివృద్ధి పై మాట్లాడే దమ్ము లేక అనవసర విమర్శలు
-వివేక్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు బాల్క సుమ‌న్ ఫిర్యాదు

Balka Suman: చెన్నూరు కాంగ్రెస్ అభ్య‌ర్థి గ‌డ్డం వివేక్ సూటుకేస్ కంపెనీలు పెట్టి వాటి ద్వారా డ‌బ్బులు చెలామ‌ణి చేస్తున్నార‌ని, ఆ డ‌బ్బుల ద్వారా అర్రాజు పెట్టి మ‌రీ నాయ‌కుల‌ను కొనుగోలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న బుధ‌వారం వివేక్ పై ఎన్నిక‌ల కమిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. వివేక్ కంపెనీ నుంచి ఒక సూట్ కేసు కంపెనీకి సోమవారం ఎనిమిది కోట్లు బదిలీ చేశారని వెల్ల‌డించారు. ఈ సూట్ కేసు కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు వివేక్ కంపెనీ ఉద్యోగులని స్ప‌ష్టం చేశారు. ఆ కంపెనీ రామగుండం లో వివేక్ ఇంటి చిరునామా పైనే ఉందని దీనిపై విచార‌ణ చేయాల‌న్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓ కు ఫిర్యాదు చేశామ‌ని, ఈ ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరామ‌ని వెల్ల‌డించారు.

ఇదే విష‌యంలో, ఈడీ, ఆదాయ పన్ను శాఖలతో పాటు ప్రత్యేక వ్యయ పరిశీలకునికి కూడా ఫిర్యాదు చేస్తామ‌ని బాల్క సుమ‌న్ వెల్ల‌డించారు. వివేక్, కుటుంబ సభ్యులు, కంపెనీలు, బంధువుల బ్యాంకు ఖాతాల పై నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. వివేక్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులకు డబ్బులు పంపుతున్నారని, ఆ పాపంలో పాలు పంచుకోవద్దని స్థానిక వ్యాపారులను కోరారు. డబ్బు అహంకారంతో వివేక్ నేతలను అర్రాజు పాటలో కొనుగోలు చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. ఇలాంటి నమ్మక ద్రోహి, మోసకారి వల్ల భాజపా కనీసం మేనిఫెస్టో కూడా ప్రకటించలేకపోయిందని వెల్ల‌డించారు.

నేను కోట్లు సంపాదించి ఉంటే నీలాగా వ్యాపార సామ్రజ్యాన్ని ఏర్పరచుకునే వాన్ని కదా? అని ఈ సంద‌ర్భంగా సుమ‌న్ వివేక్‌ను ప్ర‌శ్నించారు. అభివృద్ధి పై మాట్లాడే దమ్ము లేక వివేక్ నాపై అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. వివేక్ కుటుంబం హయాంలో… మా హయాంలో చెన్నూరు అభివృద్దిపై చర్చకు సిద్దమ‌ని స‌వాల్ విసిరారు. డబ్బు సూట్ కేసులతో నేతలను కొనుగోలు చేసి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తున్నారని, ధన రాజకీయాలు చేసే వ్యక్తులు ప్రజాస్వామ్యానికి పట్టిన పీడగా అభివ‌ర్ణించారు. ఇలాంటి వాళ్లకు తెలంగాణ సమాజం బుద్ది చెప్పాలన్నారు. ఇప్పుడు జ‌రుగుతున్న పోటీ వేల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తికి, వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ది చేస్తున్న వ్యక్తికి మధ్య అని వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like