భైంసాలో ఆసుపత్రి సిబ్బందిపై ఓ వర్గం దాడి..
![](https://naandinews.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-29-at-3.57.18-PM-750x430.jpeg)
నిర్మల్ జిల్లా భైంసా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రక్తనమూనాలు సేకరిస్తున్న సమయంలో మహిళా రోగి చేయి పట్టుకున్నాడని ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆ మహిళ చేయి పట్టుకున్నాడని సిబ్బందిపై ఓ వర్గం యువకులు దాడికి దిగారు. గాయపడ్డ సిబ్బంది పోలీస్ స్టేషన్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏరియా ఆసుపత్రిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిబ్బందిపై దాడిని ఖండిస్తూ విధులు మానేసి ఆసుపత్రి సిబ్బంది రాస్తారోకో చేశారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ 50 మంది వరకు కలిసి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భైంసాలో పనిచేయాలంటేనే సిబ్బంది వణికిపోతున్నారని తెలిపారు. అసలు ఇక్కడకు పనిచేసేందుకు ఎవరూ రారని, కానీ తాము మాత్రం ఇక్కడే 15 ఏండ్లుగా పనిచేస్తున్నామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు.