బ్రేక్ బదులు.. ఎక్స్లేటర్..
-కరీంనగర్ ప్రమాదానికి కారణమిదే
-కొడుకును తప్పించేందుకు తండ్రి ప్రయత్నాలు
-ముగ్గురు మైనర్లు, కారు ఓనర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
![](https://naandinews.com/wp-content/uploads/2022/01/10-driving-tips-fo-hero-750x430.jpg)
కరీంనగర్ : పరిమితికి మించి వేగం… పైగా మైనర్లు… ప్రమాదం జరుగుతోందని తెలిసి బ్రేక్ వేయబోయి కంగారులో ఎక్స్లేటర్ తొక్కడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువైంది.. ఇదే నలుగురి మృతికి కారణమైంది.కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద కారు బీభత్సంలో పోలీసుల దర్యాప్తులో తేలింది ఇదే..
కరీంనగర్ జిల్లాలో సంచలనం కలిగించిన కమాన్ కారు ప్రమాదంలో సంచలన అంశాలు బయట పడుతున్నాయి. కారు నడిపింది మైనర్ బాలుడని తేలింది. ఈ ప్రమాద సమయంలో కారులో మరో ఇద్దరు మైనర్లు వున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగే ఐదు నిమిషాల ముందు కమాన్ చౌరస్తా లోని పెట్రోల్ బంక్ లో ఇంధనం నింపుకుని రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేశాడు మైనర్ బాలుడు.
డ్రైవింగ్ రాకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు ప్రత్యక్షసాక్షులు. కారు 100 స్పీడ్ తో జనంపైకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు.నిన్న రాత్రి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు కారులోనే వీడియో షూట్ చేయడం కూడా ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కారు యజమాని రాజేంద్రప్రసాద్ తో పాటు అతని కొడుకు మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
అయితే తన కొడుకును తప్పించేందుకు రాజేంద్రప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కరీంనగర్ సీపీ సత్యనారాయణ వెల్లడించారు. డ్రైవింగ్ తానే చేసినట్లు మొదట పోలీసులకు చెప్పాడని చెప్పారు. కానీ పోలీసులు చేసిన దర్యాప్తులో ఆయన కొడుకే డ్రైవింగ్ చేసినట్లు తేలిందన్నారు. తండ్రి రాజేంద్రప్రసాద్ కొడుకుకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని సీపీ చెప్పారు. ఇలా మైనర్లకు వాహనాలు ఇవ్వడం తప్పని తాము ఎన్నిసార్లు ప్రచారం చేసినా వారికి వాహనాలు ఇవ్వడం పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.