చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3

Chandrayaan-3 : ఇస్రో (ISRO) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. భూ కక్ష్యలను పూర్తి చేసుకున్న చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోకి శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రవేశించింది. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లేలా లూనార్ ఆర్బిట్ ఇన‌సర్షన్ ప్రక్రియను ఇస్రో చేపట్టింది. 18 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలోనే చంద్రయాన్-3 ఆర్బిటర్ తిరుగుతుంది. చంద్రయాన్-3 మిషన్ లో అత్యంత కీలకమైన ఘట్టం శనివారం చోటుచేసుకుంది. అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించిన ఇస్రో కచ్చితమైన ప్రణాళికతో ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి చంద్రయాన్-3 విజయవంతంగా ప్రవేశపెట్టింది.

చంద్రుడిపై 14 రోజుల పాటు పరిశోధనల కోసం జులై 14న ఇస్రో చంద్రయాన్​-3 లాంచ్​ చేసింది. మొత్తం 5 దశలుగా స్పేస్​క్రాఫ్ట్​ ఆర్బిట్​ను పెంచుకుంటూ వచ్చింది. ఆగస్ట్​ 1న ఈ స్పేస్​క్రాఫ్ట్​ భూ కక్ష్య వీడి చంద్రుడివైపు ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తాజాగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్​ ప్రాజెక్ట్స్​లో భాగంగా ఇప్పటివరకు మూడు ప్రయోగాలు చేపట్టింది ఇస్రో. మొదటి ప్రయోగమైన చంద్రయాన్-1 విజయవంతమైంది. అంతేకాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని నిరూపించి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

2019లో చేపట్టిన రెండో ప్రయోగం చంద్రయాన్-2 విఫలమైంది. చివరి దశ అయిన ల్యాండింగ్ వరకు ఈ ప్రయోగం వెళ్లగలిగింది. కానీ చంద్రుడి ఉపరితలంపైకి దిగే సమయంలో విఫలమై, కుప్పకూలిపోయింది. ఈసారి ఎలాంటి తప్పిదాలు జరగ‌కుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్న ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే, చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన నాలుగో దేశంగా భారత్ రికార్డులకెక్కుతుంది. అమెరికా, సోవియట్ యూనియన్, చైనాలు ఇప్పటి వరకు ఈ ఘనతను సాధించాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like