మామను ముద్దాడిన విక్రమ్
![](https://naandinews.com/wp-content/uploads/2023/08/Vikram-1-750x430.jpg)
Chandrayaan-3: కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. ప్రపంచ చరిత్రలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ ఉద్విగ్నభరిత క్షణాల కోసం 140 కోట్ల మంది భారతీయులు వేచి చూడగా, వారి కల సాకారం అయ్యింది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడింది. దీంతో అమెరికా, సోవియెట్ యూనియన్ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్కు ప్రయత్నించిన రష్యా లూనా-25 ఈ నెల 19న జాబిల్లిపై క్రాష్ ల్యాండ్ అయిన నేపథ్యంలో చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.