చనిపోయిందనుకున్న పాము.. లేచి కాటేసింది..
![](https://naandinews.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-10-at-10.20.09-AM-750x430.jpeg)
లేకలేక కలిగిన సంతానం… పెళ్లయిన పదహారేళ్లకు పుట్టడంతో కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ, ఆ కుటుంబంలో ఓ ఘటన విషాదాన్ని నింపింది… వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాంలో బైరెడ్డి సంతోష్-అర్చన దంపతుల కుమారుడైన నైతిక్(2) గురువారం వేకువజామునే నిద్రలేచి పక్కింటావిడ వద్ద ఆడుకుంటున్నాడు. అదే సమయంలో దగ్గర్లోనే పాము కనిపించడంతో గ్రామంలోని వారు దాన్ని కర్రతో కొట్టారు. అచేతనంగా పడి ఉంటే చనిపోయింది అనుకుని దాని పక్కకు జరిపారు. పామును చూడడానికి అందరూ గుమిగూడారు. అందులో బాబును ఎత్తుకున్న పక్కింటి మహిళ కూడా ఉంది. అందరూ చనిపోయిన పామును గమనిస్తూ ఉండగా.. ఒక్కసారిగా పైకి లేచిన పాము మహిళ చేతిలోని చిన్నారి నైతిక్ ను కాటేసింది. ఈ హఠాత్పరిణామానికి షాక్ తిన్న గ్రామస్తులు బాలుడిని హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గురువారం రాత్రి నైతిక్ చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకాలు మిన్నంటాయి.