మరో నేత పాదయాత్ర… ఇప్పుడు భట్టి వంతు..
-91 రోజులు, 39 నియోజకవర్గాలు, 1,365 కిలోమీటర్లు
-ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు
-షెడ్యూల్ ప్రకటించిన కాంగ్రెస్ నేతలు
![](https://naandinews.com/wp-content/uploads/2023/03/Untitled-1-copy-750x430.jpg)
CLP leader Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీలో మరో నేత పాదయాత్ర చేపట్టనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నుంచి యాత్ర ప్రారంభిస్తారు. హాత్ సే హాత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్ర చేపట్టనున్నారు. బోథ్ నియోజకవర్గంలోని బజార్హత్నూరు మండలం పిప్రిలో ఈ నెల 16న సాయంత్రం నాలుగు గంటలకు మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్ర ప్రారంభిస్తారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వరకూ కొనసాగే యాత్ర మొత్తం 1,365 కిలోమీటర్లు, 91 రోజుల పాటు 39 నియోజకవర్గాల మీదుగా సాగనుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే పాదయాత్ర ప్రారంభించనున్నారు.
హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. గత నెల 6న రేవంత్ రెడ్డి మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర సాగుతోంది. మరో కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి సైతం పాదయాత్ర చేశారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాదయాత్ర ప్రారంభించనున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాదయాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పార్టీ నేతలంతా పాదయాత్రలు నిర్వహించాలని మాణిక్ రావు ఠాక్రే తేల్చిచెప్పడంతో ఎక్కడిక్కడ నేతలు ముందుకు కదులుతున్నారు.