కలెక్టర్‌కూ తప్పని తిప్పలు

-అమ్మా బడికి వెళ్లనంటూ సిక్తా పట్నాయక్ కొడుకు మారాం -బుజ్జగించి తరగతి గదిలోకి పంపిన కలెక్టర్

ఆదిలాబాద్: వేసవి సెలవులు ముగిశాయి. పిల్లలంతా ఇవాళ బడి బాట పట్టారు. దాదాపు రెండేళ్ల తర్వాత జూన్‌లో పాఠశాలలు తెరుచుకోవడంతో కొంతమంది పిల్లలు ఉత్సాహంగా వెళ్తే మరికొందరేమో మారం చేస్తూ తరగతి గదికి వెళ్లారు. ఆదిలాబాద్‌లో తన కుమారుణ్ని బడిలో దిగబెట్టడానికి స్వయంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాఠశాలకు వెళ్లారు. బాబు క్లాస్‌లోకి వెళ్లనని మారాం చేయడంతో బుజ్జగించి తరగతి గదిలోకి పంపారు.

రాష్ట్రవ్యాప్తంగా పిల్లలంతా బడి బాట పట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి విజృంభిస్తున్నా కేసీఆర్ సర్కార్ ఈ ఏడాది వెనక్కి తగ్గలేదు. కరోనా తరిమికొట్టడానికి సరైన జాగ్రత్తలు తీసుకుని పిల్లల్ని బడికి పంపిస్తామని తెగేసి చెప్పింది. అందుకే దాదాపు రెండేళ్ల తర్వాత జూన్‌లో పాఠశాలలను తెరిచింది.వేసవి సెలవులు ముగించుకున్న పిల్లలంతా ఇవాళ ఉదయాన్నే ఉత్సాహంగా పాఠశాలలకు బయలుదేరారు. చాలా రోజుల తర్వాత తమ స్నేహితులను కలుసుకున్న వారితో బడులన్నీ కిటకిటలాడాయి. దాదాపు రెండేళ్ల తర్వాత పాఠశాల ప్రాంగణాల్లో ప్రార్థనా గీతాలు వినిపించాయి.

ఆదిలాబాద్‌ జిల్లాలోనూ విద్యార్థులను దిగబెట్టడానికి వారి తల్లిదండ్రులు కూడా తోడుగా వెళ్లారు. తన కుమారుడు సారంగ్‌ను పాఠశాలలో దిగబెట్టడానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్వయంగా వెళ్లారు. బాబు తరగతిగదిలోకి వెళ్లనని మారాం చేస్తూ కాసేపు ఏడ్చాడు. ఆ చిన్నారిని బుజ్జగించడానికి కలెక్టర్‌కు చాలా సమయమే పట్టింది. ఎట్టకేలకు అమ్మ మాట విని సారంగ్ క్లాస్‌కి వెళ్లాడు. విద్యార్థులతో పాఠశాల ఆవరణలు సందడిగా మారాయి. కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులను బుజ్జగించడానికి టీచర్లు నానాతంటాలు పడాల్సి వచ్చింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like