21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు
![](https://naandinews.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-14-at-12.35.51-PM-750x430.jpeg)
Commemoration Day of Police Martyrs from 21: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అక్టోబర్ 21న ఘనంగా నిర్వహించడంతో పాటు అదే రోజు నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతో సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్టు రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వేడుకలు నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగం, ప్రజల రక్షణ లో పోలీసుల సేవలు, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ మొదలగునవి విషయాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. వ్యాసరచన పోటీలు కేటగిరీల వారీగా నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో కేటగిరి-1లో ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పాత్ర, కేటగిరి-2లో డిగ్రీ ఆపైన విద్యార్థులకు సైబర్ క్రైమ్ నివారణలో పోలీసులు, పౌరుల పాత్ర అనే అంశాల మీద విద్యార్థులకు “ఆన్లైన్ లో వ్యాసరచన పోటీలు” నిర్వహిస్తామన్నారు. మొదటి ముగ్గురికి ప్రశంసాపత్రాలు అందజేస్తామని కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు.
ఇక పోలీసులకు సైతం వివిధ కేటగిరీల్లో పోటీలు ఉంటాయని స్పష్టం చేశారు. కేటగిరి -1లో కానిస్టేబుల్ అధికారి నుండి ఏ ఎస్.ఐ స్థాయి అధికారి వరకు పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయవలసిన కృషి. కేటగిరి-2లో ఎస్.ఐ స్థాయి అధికారి పై స్థాయి అధికారులకు..సమర్ధవంతమైన పోలీసింగ్ లో మహిళా పోలీస్ ల పాత్రపై ఉంటుందని చెప్పారు. అదే విధంగా రక్తదాన శిబిరాలు, పోలీస్ అమరవీరుల స్మరిస్తూ సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా లఘు చిత్రాలు, ఫోటోల పోటీలు సైతం ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. పోలీస్ ఫ్లాగ్ డేలో భాగంగా పోలీస్ త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే తక్కువ నిడివి గల షార్ట్ ఫిలిమ్స్, ఈ మధ్య తీసిన ఫోటోలు ,ఆర్టికల్ ల పై ఈ నెల తేది: 25 లోపు స్పెషల్ బ్రాంచ్ లో అందించాలన్నారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సెల్ ఫోన్ నెంబర్ 8712656596 కు సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూనే పబ్లిక్ స్థలాల్లో పోలీస్ అమరవీరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందం తో పాటల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 21న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో “పోలీస్ అమరవీరుల సంస్మరణలో ఘనంగానివాళులు అర్పిస్తూ “స్మృతి పరేడ్”, “పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమాలు నిర్వహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.