ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ స‌రికొత్త రికార్డు

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ స‌ర్కార్ స‌రికొత్త రికార్డు సృష్టించింది. ధాన్యం కొనుగోళ్లు గత ఏడాది వానాకాలం రికార్డును దాటాయ‌ని… పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 9 లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామ‌ని.. మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు కొనే ఛాన్స్ ఉన్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌ట‌న చేశారు. గత ఏడాది 48.75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ జ‌రిగిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 14 జిల్లాల్లో 1,810 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి అయిన‌ట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆకాల వర్షాలు ఇబ్బందుపాలు చేసినా.. కొనుగోళ్లలో వేగం పెంచామ‌న్నారు.

వానాకాలంలో ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించింది.ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లనే సాధ్యమైందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడు సంవత్సరాల్లో భారతదేశ అబ్బురపడే విధంగా వ్యవసాయరంగం అభివృద్ధి చెందిందని, వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని నిరూపించారని అన్నారు.వ్యవసాయమే సాధ్యం కాదన్నచోట ఏడాదిలో కోటి టన్నులకు పైగా ధాన్యం పండించి చూపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అడుగడుగునా అండగా నిలిచారు.

ధాన్యం కొనుగోళ్లు అర్థికంగా భారమైనా రైతుల నుంచి పూర్తి స్థాయిలో పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని కేసీఆర్ ఆదేశించిన‌ట్లు తెలిపారు. కోటి ఎకారాలను సాగులోకి తేవాలని కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని స్ప‌ష్టం చేశారు. ప్రపంచం యావత్తు అశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. గ్రామాల్లో చెరువులను నింపారని, వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటలు కరెంటును ఉచితంగా అందిస్తున్నారని వెల్ల‌డించారు. వ్యవసాయం చేయడానికి పెట్టుబడి కోసం ఎదురుచూడకుండా ఎరువులు, విత్తనాల కోసం రైతుబంధు పథకం ద్వారా ప్రతి పంటకు రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు వేస్తున్నారని చెప్పారు. ఏ కారణం చేత రైతు మరణించిన అతడి కుటుంబానికి 5 లక్షల రైతు భీమా అందించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారని వెల్ల‌డించారు.

రైతులంగా ఒక దగ్గర కూర్చొని వ్యవసాయంపై చర్చించుకునేందుకు రైతు వేదికలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సీజన్ వరకు ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని మారెడ్డి భరోసా ఇచ్చారు. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. 14 జిల్లాల్లో 1,810 కొనుగోలు కేంద్రాలను మూసివేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like