ఎదురెదురుగా రైళ్లు… అయినా ఢీ కొట్టలేదు…
![](https://naandinews.com/wp-content/uploads/2022/03/maxresdefault-750x430.jpg)
ఒకే పట్టాలపై ఎదురెదురుగా రెండు రైళ్లు… ఈ రెండు రైళ్లలో.. ఒక దానిలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో దానిలో రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ఉన్నారు.. అయితే రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చినా అవి ఢీకొట్టలేదు. ఒకే పట్టాలపై ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు రైళ్లు వాటి మధ్య దూరం 380 మీటర్లు ఉండగానే.. వాటిలో అప్పటికే అమర్చిన కవచ్ అలెర్ట్ అయిపోయింది. రెండు రైళ్లు వాటికవే బ్రేకులేసుకుని నిలిచిపోయాయి.
భారతీయ రైల్వే సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కవచ్ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీనిని ట్రాక్ పై ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు కేంద్ర రైల్వే మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ రైళ్లలో ప్రయాణించారు. సున్నా ప్రమాదాలే లక్ష్యంగా దేశీంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ రైల్వేలలో ప్రవేశపెట్టనున్నారు. దీని వల్ల నిర్ణీత దూరంలో అదే ట్రాక్ పై మరో రైలు ఎదురుగా వస్తే ఆటోమెటిక్గా రైలు ఆగిపోతుంది.సనత్నగర్-శంకర్పల్లి సెక్షన్లో సిస్టమ్పై ట్రయల్లో విజయవంతంగా దీనిని పరీక్షించారు. భద్రత కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ప్రపంచ స్థాయి టెక్నాలజీ కవచ్ అందుబాటులోకి రావడం వల్ల రైల్వే ప్రమాదాలు తగ్గుతాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా అవి ఢీకొట్టుకునే అవకాశాలు ఉండవు. కవచ్ టెక్నాలజీ కారణంగా అల్లంత దూరంలోనే రెండు రైళ్లు వాటికి అవే బ్రేకులు వేసుకుని ఆగిపోతాయని అధికారులు వివరిస్తున్నారు.
రైలు ప్రమాదాలు నివారించాలనే ఉద్దేశంతో కొత్తగా ‘కవచ్’ అనే రక్షణ వ్యవస్థను రైల్వేస్ లో ప్రవేశపెట్టనున్నారు. హెడ్-ఆన్ ఢీకొనడం, వెనుక వైపు నుంచి తాకిడి, సిగ్నల్ జంపింగ్ అనే మూడు సందర్భాల్లో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో పరీక్షించారు. సాధారణంగా ఎప్పుడైనా రైలు అనుమతి లేకుండా వెళ్లినప్పుడు లేదా స్టాప్ అని సిగ్నల్ వచ్చినా పట్టించుకోకుండా రైలు కదలినప్పుడు సిగ్నల్ వస్తుంది. లోకో పైలట్ దానిని గమనించినా, గమనించపోయినా ట్రైన్ ఆపడంలో విఫలం అయితే ఆటోమేటిక్ బ్రేక్ అప్లికేషన్ ద్వారా కవచ్ రక్షణ వ్యవస్థ రైలు వేగాన్ని ఒక్క సారిగా నిలిపివేస్తుంది. ఇది అధిక ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ని ఉపయోగించడం ద్వారా పని చేస్తుంది.
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా 2022 యూనియన్ బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. 2022-23లో భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం 2,000 కి.మీ రైలు నెట్వర్క్ను స్వదేశీ పరిజ్ఞానంతో ప్రపంచ-స్థాయి టెక్నాలజీని కవచ్ కిందకు తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటి వరకు కవాచ్ కింద 1098 రూట్ కి.మీ, దక్షిణ మధ్య రైల్వే యొక్క ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్లలో 65 లోకోలలో ప్రవేశపెట్టారు. ఇంకా ఢిల్లీ-ముంబై, ఢిల్లీ హౌరా కారిడార్లలో కవచ్ను అమలు చేయడానికి ప్రణాళికను రూపొందించారు. మొత్తం ఈ రూట్ సుమారు 3000 కిలో మీటర్లు ఉంటుంది.