గీత కార్మికుల‌కు రూ. 5 ల‌క్ష‌ల బీమా

-రైతు బీమా తరహాలోనే గీత కార్మికుల బీమా
-వారం రోజుల్లోనే బీమా డబ్బు అందేలా చర్యలు
-విధి విధానాలు రూపొందించాలని కేసీఆర్ ఆదేశం
-నూతన సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి సమీక్ష

Telangana: రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సిఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపాందించాలని, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మంగళవారం డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట ఘటనలు జరుగుతుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్న‌ద‌న్నారు. ఇప్పటికే ఎక్స్గ్రేషియా అందిస్తున్నా బాధితులకు సాయం అందడంలో ఆలస్యం అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతు బీమా త‌ర‌హాలోనే, కల్లుగీత వృత్తిగా కొనసాగిస్తున్న, గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, హ‌రీష్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like