దిగ్విజయంగా ద్వితీయ పర్వం….

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత - పెద్ద ఎత్తున హాజరైన గులాబీ శ్రేణులు - నిజామాబాద్ కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు అందజేత

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వెంటరాగా, నిజామాబాద్ కలెక్టరేట్ లో కవిత నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.

నామినేషన్ వేసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, రెండోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పోటీ చేసినప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించారని చెప్పారు. ఈ సంవత్సర కాలంలో సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన‌ట్లు వెల్ల‌డించారు. కామారెడ్డి టేక్రియాల్ దగ్గర స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్సీ కవితకు మంగళహారతులతో స్వాగతం పలికారు. బాణసంచా పేళుళ్లు, డప్పు చప్పులతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇందల్ వాయి టోల్ ప్లాజా, డిచ్ పల్లి వద్ద సైతం నాయకులు, కార్యకర్తులు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మెల్సీ కవితకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.

దారిపొడవునా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. కార్యకర్తలు అడుగడుగునా తమ అభిమాన నాయకురాలిపై పూల వర్షం కురిపించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్సీ కవిత కలెక్టరేట్ వైపు ముందుకు సాగారు. ఆమె వెంట‌ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, సురేష్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ దాదాన్న గారి విఠల్, కామారెడ్డి జెడ్పీ చైర్మన్ దఫేదార్ శోభ, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, షకీల్, గంప గోవర్ధన్, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like