రామగుండం కమిషనరేట్ లో ఘనంగా నిమజ్జన వేడుకలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఆదివారం నిమ‌జ్జ‌న వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇక్క‌డ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పాల్గొని పూజ నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు. పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ తో కలిసి పాల్గొని పూజ‌లు నిర్వ‌హించారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సీపీ స్వయంగా పోలీస్ అధికారులకు, సిబ్బంది కి భోజనం వ‌డ్డించారు.

అనంతరం క‌మిష‌న‌ర్ రెమా రాజేశ్వ‌రి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా తాము మొదలు పెట్టిన పనులు పూర్తి అయ్యేటట్లు చూడాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద యువత జాగ్రత్తలు తీసుకున్నార‌ని వెల్ల‌డించారు. ఇదేరీతిలో నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సీపీ తెలిపారు.

అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆరు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభయాత్ర సీపీ రెమా రాజేశ్వ‌రి ప్రారంబించగా డప్పు వాయిద్యాలతో, పోలీస్ అధికారులు సిబ్బంది, పిల్లలు అందరు ఆనందోత్సవ నృత్యాలతో కోలాహలం మధ్య వినాయ‌కున్ని ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఏసీపీలు తుల శ్రీనివాసరావు, ఎడ్ల మహేష్, సదయ్య, మోహన్, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, సీఐలు ఆర్ఐలు దామోదర్, మల్లేశం,వామన మూర్తి, శ్రీధర్, విష్ణు ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like