అక్రమ సంబంధం ఖరీదు ఆరు ప్రాణాలు
![](https://naandinews.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-17-at-12.12.55-PM-750x430.jpeg)
illicit-relationship-costs-six-lives: మందమర్రి మండలం వుడిపెల్లిలోని ఎమ్మెల్యే కాలనీలో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఒక నిర్దారణకు వచ్చినట్లు సమాచారం. అక్రమ సంబంధం కారణంగానే ఇంటికి నిప్పంటించినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు ధృవీకరించకపోయినా ఆ వైపుగా విచారణ జరిపిన పోలీసులకు ఈ విషయంలో ఇప్పటికే పోలీసులకు స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. వారు ఇంకా ధృవీకరించడం లేదు.
అక్రమ సంబంధమే అసలు కారణం..?
వుడిపెల్లిలోని ఓ ఇంట్లో గత రాత్రి ఆరుగురు సజీవదహనమయిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారిలో ఇంటి యజమాని మాసు శివయ్య (50), ఆయన భార్య పద్మ (45), పద్మ అక్క కుమార్తె మౌనిక (25), మౌనిక ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారితో పాటు ఆర్ కే 5 బీలో మైనింగ్ సర్దార్గా పనిచేస్తున్న శాంతయ్య (50) కూడా ఇంట్లో ఉన్నాడు. అయితే శివయ్య భార్య పద్మకు శాంతయ్యకు మధ్య శారీరక సంబంధం ఉన్నట్లు సమాచారం.
పదిహేను రోజుల కిందట హత్యాయత్నం..
దీనికి సంబంధించిన విషయంలో శాంతయ్య కుటుంబ సభ్యులు నిత్యం ఆయనను నిలదీశారు. శాంతయ్య భార్య ఆయన పనిచేస్తున్న గనిపైకి వెళ్లి అక్కడ కూడా గొడవ చేసింది. శాంతయ్యపై కొద్ది రోజుల కిందట హత్యాప్రయత్నం చేయగా, దాని నుంచి కూడా తప్పించుకున్నట్లు సమాచారం. ఇలాంటి సందర్భాల్లో ఆ ఘటన విషయంలో పోలీసులు శాంతయ్య కుటుంబసభ్యులను అనుమానిస్తున్నారు.పద్మపై సైతం దాడి చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.ఘటనా స్థలంలో ఓ ఆటోలో కారంపొడి లభించింది.
ఉద్యోగం, పొలాల కోసం జరిగిన గొడవలే కారణమా..?
సింగరేణిలో మైనింగ్ సర్దార్గా పనిచేస్తున్న శాంతయ్య మరో రెండేళ్లలో రిటైర్ కానున్నారు. ఆ ఉద్యోగం వేరే వాళ్లకు ఇస్తారని శాంతయ్య కొడుకు భావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారు శాంతయ్యను నిలదీసినట్లు తెలుస్తోంది. శాంతయ్యకు లక్ష్సెట్టిపేట మండలం ఊత్కూరులో పొలాలు ఉన్నాయి. అవి కూడా తమ చేజారిపోకుండా ఉండేందుకు తమ పేరిట రాయాలని గొడవ చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చుట్టపు చూపుగా వచ్చి తల్లి, పిల్లల మృత్యువాత..
కోటపల్లి మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక భర్త చనిపోయాడు. తనకు తల్లిదండ్రులు కూడా లేరు. ఈ నేపథ్యంలో తన పిన్ని అయిన పద్మ ఇంటికి తరచూ వస్తూ వెళ్తుండేది. రెండు రోజుల కిందటే పద్మ ఇంటికి వచ్చింది. చుట్టం చూపుగా వచ్చిన పద్మతో పాటు ఆమె పిల్లలు ఇద్దరూ ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. దీంతో అటు తల్లిదండ్రులు లేక, భర్త లేకపోవడంతో పాటు పద్మతో సహా చిన్నారులు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో ఎవరూ లేకుండా అయిపోయింది. ఈ మేరకు డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ, సీఐ ప్రమోద్రావు విచారణ చేస్తున్నారు.
ఘటనా స్థలం వద్దనే శవాలకు పోస్టుమార్టం..
ఈ ఘటనలో ఆరుగురు మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు మొదట వాటిని తరలించే ప్రయత్నం చేశారు. అయితే మృతదేహాలు గుర్తించలేని విధంగా మారిపోవడంతో సంఘటన స్థలం వద్దే పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.