రేవంత్‌రెడ్డి ఢిల్లీకి అందుకే వెళ్లారా..?

-ఇవాళ ఖర్గే, సోనియా, రాహుల్ తో భేటీ
-మంత్రివర్గ కూర్పుపై చర్చ

తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయనకు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం ల‌భించింది. ఎయిర్‌పోర్టు నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ అధికారులు సీఎం హోదాలో రేవంత్ కు ప్రోటోకాల్ స్వాగతం పలికారు. ఆ తరువాత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె శివకుమార్‌తో రేవంత్ భేటీ అయ్యారు. క్యాబినెట్‌ కూర్పుపై వీరి మధ్య చర్చజరిగినట్లు తెలుస్తోంది. క్యాబినెట్‌లో ఎవరెవరు ఉండాలి, సామాజిక సమీకరణాల మేరకు ఎవరికి అవకాశం కల్పించాలి, డిప్యూటీ సీఎంలుగా ఎవరికి చాన్స్‌ ఇవ్వాలన్న దానిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాగూర్‌తోనూ భేటీ అయ్యారు. గతంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఠాగూర్ పనిచేశారు.

రేవంత్ రెడ్డి బుధ‌వారం కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. రాహుల్, సోనియా, ప్రియాంకతో పాటు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రేవంత్ సమావేశం అవుతారు. ఉదయం ఖర్గేతో భేటీ అవుతారు. ఆ తరువాత రాహుల్, సోనియా, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ తో భేటీ అవుతారు. సీఎంగా అవకాశం కల్పించినందుకు రేవంత్ వారికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. అదేవిధంగా 7న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానిస్తారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీలో కేబినెట్ కూర్పుపైనా రేవంత్ చర్చించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like