జైలుకు పంపిస్తాం..

టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి హైకోర్టు వార్నింగ్

వరి విత్తనాల విక్రయాలకు సంబంధించిన వ్యవహారంలో కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు తేలితే జైలుకు పంపిస్తామని మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని హైకోర్టు హెచ్చరించింది. కోర్టులపై వ్యాఖ్యలు చేశారా? లేదా? సూటిగా పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని వెంకట్రామిరెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది.

గతేడాది అక్టోబర్‌లో సిద్దిపేటలో జరిగిన వ్యవసాయాధికారులు, విత్తన డీలర్లతో నిర్వహించిన సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెంకట్రామిరెడ్డిపై కోర్టులో కేసు దాఖలైంది. యాసంగి పంట కోసం వరి విత్తనాలు అమ్మితే కేసులు పెడతామని, హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా వదిలిపెట్టబోమని వెంకట్రామిరెడ్డి అన్నారన్న ఆరోపణలకు సంబధించిన సుమోటో వ్యాజ్యంపై హైకోర్టు సీజే జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది.

గత విచారణలో కోర్టు ఆదేశాల మేరకు వెంకట్రామిరెడ్డి హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే అఫిడవిట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ప్రస్తావనే లేకపోవడంపై ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారా? లేదా? సూటిగా పేర్కొంటూ తాజాగా మరో అఫిడవిట్‌ దాఖలు చేయాలని వెంకట్రామిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని, జైలుకు పంపిస్తామని వ్యాఖ్యానించిన హైకోర్టు.. విచారణను ఏప్రిల్‌ 4వ తేదీకి వాయిదా వేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like