జర్నలిస్టు సమస్యలు పరిష్కరించండి
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
![](https://naandinews.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-05-at-10.45.25-AM-750x430.jpeg)
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ను టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. శుక్రవారం ఢిల్లీలో అనురాగ్ సింగ్ ఠాకూర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు ఆధ్వర్యంలో టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కేంద్రమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రికి పలు విషయాలను తీసుకువెళ్లారు.
జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం సెంట్రల్ అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కమిటీ ద్వారా కేంద్రానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారు. కరోనాకు ముందు అమలు లో ఉన్న రైల్వే రాయితీ పునరిద్దరించాలని కోరారు. రైల్వే ప్రయాణ రాయితీ 50 శాతం నుండి 100 శాతానికి పెంచాలని కోరారు. జర్నలిస్ట్ కుటుంబంలో ఒక్కరికి ఏడాదిలో రెండు సార్లు మాత్రమే రైల్వే ప్రయాణంలో రాయితీ ఇస్తున్నారని, ఈ పరిమితి ఎత్తివేసి ఎన్నిసార్లు ప్రయాణం చేసినా రాయితీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన జర్నలిస్ట్ ల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా కేంద్రం తరఫున ప్రకటించాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి సాధ్యా సాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావుతో పాటు టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు టి.సురేందర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలి సతీష్, కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కార్యదర్శి పార్వతి రాజశేఖర్, కోశాధికారి కృష్ణ మోహన్ గౌడ్ పాల్గొన్నారు.