‘కాంట్రాక్ట్’ కష్టాలు
పర్మినెంట్కు నోచని కాంట్రాక్టు కార్మికులు - అమలు కాని హైపవర్ వేతనాలు - ఇబ్బందుల్లో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు - 20 వేలకుపైగా దినసరి కార్మికుల వెతలు - కనీస వేతనాలు, హక్కులు అమలు లేదు
![](https://naandinews.com/wp-content/uploads/2021/12/singareni-Collieries.jpg)
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల అవస్థలు చాలా దారుణంగా ఉన్నాయి. వాటి గురించి పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో సుమారు 20 వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్తత్తిలో వీరూ రెగ్యులర్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నా పనికి తగిన వేతనం లేదు. పర్మినెంట్కు నోచడం లేదు.
సింగరేణి సంస్థలో జరిగే బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాంట్రాక్టు కార్మికులు. మరి అలాంటి కార్మికులను యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సింగరేణిలో సంస్కరణల ఫలితంగా 1లక్షల 20 వేల మంది కార్మికుల నుంచి 40 వేల మంది కార్మికులకు తగ్గిపోయారు. పర్మినెంట్ కార్మికులను తొలగించిన స్థానంలో కొత్తవారిని భర్తీ చేయకుండా కాంట్రాక్టు కార్మికులను నియమించారు. ఇలా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో సుమారు 20వేలకు పైగా కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి కనీస వేతనాలు చట్టబద్దమైన హక్కులు అమలు చేయకుండా వారిని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు.
అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్టు కార్మికులే…
సింగరేణి సంస్థలో రెగ్యులర్ కార్మికులకు ధీటుగా కాంట్రాక్టు కార్మికులు అన్ని విభాగాల్లోనూ పనిచేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి మొదలు బొగ్గు సరఫరా, సంక్షేమం వంటి అన్ని రంగాల్లో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి రవాణా,ఎక్సప్లోరేషన్,స్టోర్లు,పారిశుధ్యం,బెల్ట్ క్లీనింగ్ రైల్వే సైండింగ్,తోటమాలి,హౌస్ కీపింగ్,కన్వేయన్స్ వెహికల్ డ్రైవర్లు, ఓసీపీ ఆపరేటర్లు, బ్లాస్టింగ్ వర్కర్లు, క్యాజువల్ లేబర్గా కొనసాగుతున్నారు.
పర్మినెంట్కు నోచుకునేనా..?
పదిహేను సంవత్సరాలకు పైగా సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తూ చాలీచాలని వేతనాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నడుమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాను గద్దెనెక్కితే పర్మినెంట్ చేస్తామని 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో కనీసం వారిని పట్టించుకోవడం లేదు. గుర్తింపు సంఘంగా గెలుపొందిన టీబీజీకేఎస్ కూడా ఇచ్చిన మాట ప్రకారం పర్మినెంట్ చేయడంలో విఫలం కావడంతో కాంట్రాక్టు కార్మికులు అవస్థలు పడుతున్నారు. మిగతా కార్మిక సంఘాలు సైతం వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
హైపవర్ కమిటీ వేతనాలేవీ..?
జాతీయ వేతన ఒప్పందంలో భాగంగా కాంట్రాక్టు కార్మికులకు 2013 జనవరి 1 నుండి కనీస వేతనం రోజుకు అన్స్కిల్డ్ 464 రూ, సెమిస్కిల్డ్ రూ.494, స్కిల్డ్ రూ. 524, హై స్కిల్డ్ రూ. 554, చెల్లించాల్సి ఉన్నా హైపర్ వేతనాలకు ఇప్పటికీ కాంట్రాక్టు కార్మికులు నోచుకోవడం లేదు. అలాగే చట్టబద్దంగా రావాల్సిన బోనస్, సీఎంపీఎఫ్, వైద్య సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఒప్పందం ఉన్నా వాటిని పట్టించుకోవడంలేదు. కోల్ ఇండియా పరిధిలోని బొగ్గు సంస్థల్లో ఇవన్నీ అమలు చేస్తున్నా సింగరేణిలో మాత్రం యాజమాన్యం అమలు చేయడం లేదు. బోనస్ చట్టం-2006 ప్రకారం చెల్లించాల్సిన బోనస్ ఇంత వరకు చెల్లించడం లేదు.
వారి సంక్షేమం గాలికే..
కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కనీసం ఐదు శాతం కూడా నిధులు వెచ్చించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెత్తాచెదారం తరలించడం, మురుగుకాల్వలను శుభ్రం చేయడం వంటి పనులు చేపడుతున్నా వారి బతుకులు మాత్రం అధ్వానంగానే ఉంటున్నాయి. సెప్టెక్ ట్యాంక్లు శుభ్రపరుస్తున్న కాంట్రాక్టు కార్మికులు అనారోగ్యం బారిన పడినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇలా ప్రతి పనిలోనూ వీరు కీలకంగా మారినా వేతనాల్లో, పర్మినెంట్తోపాటు ఇతర సౌకర్యాల విషయంలో మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నారు.
కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లివే..
– టీఆర్ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ గతంలో ఇచ్చిన హామీ మేరకు పర్మినెంట్ చేయాలి.
– బొగ్గు మంత్రిత్వశాఖ ఆమోదించిన హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేసి ఏరియర్స్ చెల్లించాలి.
– సీఎంపీఎఫ్ వైద్య సౌకర్యం కల్పించాలి.
– 8 గంటల పని విధానాన్ని అమలు చేసి పని ఆధారంగా క్యాటగిరైజేషన్ చేసి వేతనాలు చెల్లించాలి. చట్టబద్ద బోనస్ చెల్లించాలి.
– కాంట్రాక్టు లేబర్ చట్టం ప్రకారం), సులబ్, సివిల్, స్కావెంజర్ విధులు నిర్వహిస్తున్న వారికి ప్రత్యేక కేటగిరీ వేతనం అమలు చేయాలి. రక్షణ పరికరాలు ఇవ్వాలి.
– క్వార్టర్ సౌకర్యం కల్పించడంతోపాటు సంవత్సరానికి రెండు జతల యూనిఫాం అందించాలి.